ఏపీలో భారీగా కరోనా కొత్త కేసులు: చిత్తూరులో అత్యధికం, 3 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 35,066 నమూనాలను పరీక్షించగా.. 585 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,95,121కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది.
ఏపీలో భారీగా పెరిగిన కొత్త కేసులు, యాక్టివ్ కేసుల్లో పెరుగుదల
గత 24 గంటల్లో కరోనా బారినపడి గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7197 మంది బాధితులు మృతి చెందారు. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 251 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 8,84,978కి చేరింది. కోలుకున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,946 యాక్టివ్ కేసులున్నాయి.
ఏపీలో జిల్లాల వారీగా పెరిగిన కొత్త కరోనా కేసులు..
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,48,40,401 కరోనా నమూనాలను పరీక్షించారు. ఏపీలో జిల్లాల వారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 36, చిత్తూరులో 128, తూర్పుగోదావరిలో 42, గుంటూరులో 99, కడపలో 8, కృష్ణాలో 63, కర్నూలులో 35, నెల్లూరులో 23, ప్రకాశంలో 16, శ్రీకాకుళంలో 22, విశాఖపట్నంలో 81,
విజయనగరంలో 12, పశ్చిమగోదావరిలో 20 కరోనా కేసులు నమోదయ్యాయి.
నెలలో కోటి మందికి వ్యాక్సిన్ అంటూ జగన్ ఆదేశాలు
నెల రోజుల్లో కోటి మందికి కరోనా వ్యాక్సిన్ వేసేలా ప్రణాళికలు రూపొందించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో సోమవారం నుంచి పట్టణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ చేపట్టాలని సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రణాళిలకపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఒక్కో మండలంలో వారంలో నాలుగు రోజులు, రోజుకు 2 గ్రామాలు చొప్పున వ్యాక్సినేషన్ చేయాలని సూచించారు. లోపాలు లేకుండా విస్తృతస్థాయిలో వ్యాక్సినేషన్ చేపట్టాలని అధికారులను సీఎం జగ్ ఆదేశించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ మరో ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉందని సీఎం జగన్ అన్నారు. ఈ ఎన్నికలు కూడా జరిగి ఉంటే వ్యాక్సినేషన్ పై పూర్తిస్థాయిలో దృష్టి సారించే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు.
దేశంలో భారీగా పెరిగిన కరోనా మరణాలు
దేశ వ్యాప్తంగానూ కరోనా కేసుల్లో ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం 47,262 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,17,34,058కి చేరింది. కొత్తగా 23,907 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 1,12,05,160 కోట్లకు చేరింది. గత 24 గంటల్లో 275 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 1,60,441కి చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,68,457 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 23.46 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు వేశారు. దీంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 5,08,41,286కి చేరింది.