ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: రికవరీ డబుల్, 85వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు, జిల్లాలవారీగా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత కొద్ది రోజులుగా 8వేలకు దిగవనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, 7వేల లోపే కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,02,876 నమూనాలను పరీక్షించగా.. 6,770 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 6770 కరోనా కేసులు, 58 మరణాలు
తాజాగా నమోదైన 6770 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,09,844కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 58 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 12 మంది మరణించగా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఏడుగురు చొప్పున, శ్రీకాకుళంలో ఆరుగురు, అనంతపురం, విశాఖపట్నం జిల్లాల్లో నలుగురు చొప్పున, కడప, కృష్ణా, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.
దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా మరణాల సంఖ్య 11,828కు చేరింది.
ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 96వేలకు యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 12,492 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 17,12,267కి చేరింది. రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం 85,637 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,04,50,982 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1199 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా విజయనగరంలో 248 మంది కరోనా బారినపడ్డారు.
ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 367, చిత్తూరులో 968, తూర్పుగోదావరిలో 1199, గుంటూరులో 433, కడపలో 473, కృష్ణాలో 440, కర్నూలులో 299, నెల్లూరులో 267, ప్రకాశంలో 530, శ్రీకాకుళంలో 491, విశాఖపట్నంలో 290, విజయనగరంలో 248, పశ్చిమగోదావరిలో 765 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,47,847, చిత్తూరులో 2,08,118 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకు మించిపొయాయి.