ఘోర ప్రమాదం: బీహార్లో ఆరుగురు ఏపీవాసుల మృతి
పాట్నా/పశ్చిమగోదావరి: బీహార్ రాష్ట్రంలోని గయ సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆరుగురు మృతి చెందారు. మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురి మరణాలతో జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పంగిడి గ్రామానికి చెందిన మాసవరపు సత్యనారాయణ (58), మాసవరపు పద్మావతి (72), మాసవరపు పవన్కుమార్ (23), మాసవరపు కళావతితో పాటు నిడదవోలు పట్టణానికి చెందిన అత్తిలి శ్రీరాం(70), అత్తిలి సరస్వతిదేవి(65), అత్తిలి రుక్మిణీ(75)లు తీర్థయాత్రల నిమిత్తం రైలులో బీహార్ వెళ్లారు.
అక్కడి నుంచి ఆదివారం తెల్లవారుజామున కాశీకి కారులో బయలుదేరారు. ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్రంలోని బగ్వాల్ జిల్లా గయ సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన మరో వాహనం అదుపుతప్పి ఢీకొట్టింది.

ప్రమాదంలో కారులోని వారంతా అక్కడికక్కడే మృతి చెందగా కళావతి తీవ్రంగా గాయపడింది. స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆస్పపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో శ్రీరామ్, ఆయన భార్య సరస్వతి, సోదరి రుక్మిణి, సత్యనారాయణ, ఆయన కుమారుడు పవన్కుమార్, తల్లి పద్మావతి మృతి చెందారు. సత్యనారాయణ భార్య లక్ష్మీకళావతి తీవ్రంగా గాయపడ్డారు.
కాగా, మృతులు శ్రీరామ్ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె. కుమార్తెకు వివాహమయ్యింది. కుమారుడు హైదరాబాద్లోని ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న శ్రీరామ్ సోదరుడు పాండురంగారావు బీహార్ వెళ్లారు.
బీహార్లో విధులు నిర్వహిస్తున్న ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన విజయలక్ష్మి ప్రమాద విషయం తెలియగానే వెంటనే స్పందించారు. కౌమూర్ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు సహకరించాలని, మృతదేహాల తరలింపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చేసిన విజ్ఞప్తికి వారు సానుకూలంగా స్పందించారు.
కాగా, ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. బాధితుల కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇదే ప్రమాదంలో మృతిచెందిన సత్యనారాయణ చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సత్యనారాయణ మృతికి రాష్ట్ర స్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, కొవ్వూరు ఎమ్మెల్యే కెఎస్ జవహర్, ఐ పంగిడి గ్రామ సర్పంచ్ పొట్రు సుజాత, మాజీ ఎంపిపి పికె రంగారావు తదితరులు సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications