క్వారీలో బ్లాస్టింగ్: ఆరుగురు మృతి, చంద్రబాబు దిగ్భ్రాంతి
ఫిరంగిపురం సమీపంలోని గొల్లపాలెం మైనింగ్ క్వారీలో శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బ్లాస్టింగ్ చేపట్టడంతో బండరాళ్లు మీద పడి ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
గుంటూరు: జిల్లాలోని ఫిరంగిపురం సమీపంలోని గొల్లపాలెం గ్రానైట్ క్వారీలో శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బ్లాస్టింగ్ చేపట్టడంతో బండరాళ్లు మీద పడి ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.
మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్వారీ ప్రమాద సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, రూరల్ ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. అక్రమ పేలుళ్ల వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ఫిరింగిపురంలో పేలుడు కారణంగా క్వారీలో రాళ్లు విరిగిపడి ఆరుగురు మృత్యువాత పడిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రులు ప్రత్తిపాతి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావులను ఆదేశించారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ఘటనా స్థలానికి బయల్దేరారు. కాగా, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.