కల్తీమద్యం కేసు: బార్ యజమానితోపాటు 8మంది అరెస్ట్, మద్యం కల్తీనా? విషం కలిపారా?
విజయవాడ: కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి చెందిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వర్ణ బార్ యజమానితోపాటు ఎనిమిది మందిని పోలీసులు సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. వారిపై 304 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇది ఇలా ఉండగా, కల్తీ మద్యంపై పోలీసులు, ఎక్సైజ్ శాఖలు ఇచ్చిన నివేదికలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. ఆఫీసర్ ఛాయిస్ మద్యం కల్తీ కావడం వల్లే ప్రమాదం జరిగిందని ఎక్సైజ్ శాఖ ఇచ్చిన పేర్కొంది.
కాగా, నీళ్లలోనే విషం కలుపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక నివేదిక తేల్చింది. అయితే ల్యాబ్ నివేదికలు వచ్చాకే అసలు విషయం నిర్ధారణ అవుతుందని ఉన్నతాధికారులు చెప్పారు. విజయవాడలోని కృష్ణలంకలో గల స్వర్ణబార్లో కల్తీమద్యం తాగి ఐదుగురు మృతి చెందగా 18మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం: ఎక్సైజ్ మంత్రి రవీంద్ర
కల్తీ మద్యం బాధ్యులు ఎవరైనా వదిలిపెట్టబోమని, కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ.. బార్లో ఉన్న మద్యం స్టాక్ మొత్తం సీజ్ చేయడం జరిగిందని, శాంపిల్స్ తీసుకుని ల్యాబ్కు పంపామని తెలిపారు.
ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. మరోవైపు కల్తీ మద్యం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ, వామపక్షాలు ఆందోళనకు దిగాయి.