ఏపీలో తగ్గని కరోనా ఉధృతి: ఎక్కువ మంది కోలుకున్నారు కానీ, మరణాలు ఎక్కువే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. కరోనా పరీక్షలు పెంచుతున్న కొద్దీ.. కరోనా పాజిటివ్ కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా, గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 8,012 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 88 మంది మృత్యువాత పడ్డారు.
కేసుల కంటే ఎక్కువ కోలుకున్నారు..
కాగా, తాజాగా నమోదైన 8,012 కరోనా పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,89,829కు చేరింది. ఇక మరణాల సంఖ్య 2,650కి పెరిగింది. ఆదివారం ఒక్కరోజే 48,746 నమూనాలను పరీక్షించినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 10,117 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
జిల్లాల వారీగా మరణాలు..
జిల్లాల వారీగా మరణాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరి జిల్లాలో 10 మంది, కర్నూలు, నెల్లూరులో 9, అనంతపురం, పశ్చిమగోదావరి 8 మంది చొప్పున, విశాఖపట్నం ఏడు, గుంటూరు, కడప జిల్లాల్లో ఆరుగురు చొప్పున, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం నలుగురు చొప్పున, కృష్ణా జిల్లాలో ముగ్గురు చొప్పున కరోనా మరణాలు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.
అత్యధికంగా చిత్తూరులో కరోనా కేసులు..
ఇక జిల్లాల వారీగా కరోనా తాజా కేసులను పరిశీలించినట్లయితే.. చిత్తూరులో అత్యధికంగా నమోదయ్యాయి. అనంతపురంలో 580, చిత్తూరులో 981, తూర్పుగోదావరిలో 875, గుంటూరులో 590, కడపలో 286, కృష్ణాలో 263, కర్నూలులో 834, నెల్లూరులో 423, ప్రకాశంలో 614, శ్రీకాకుళంలో 773, విశాఖపట్నంలో 512, విజయనగరంలో 388, పశ్చిమగోదావరిలో 893 కేసులున్నాయి.
మూడో స్థానంలో ఏపీ.. యాక్టివ్ కేసుల్లో రెండో స్థానం
గత 24 గంటల్లో 8012 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 10,117 మంది కోలుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఏపీలో 85,945 యాక్టివ్ కేసులుండగా, 2,01,234 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన కలిగించే అంశంగా మారింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 28,60 లక్షల నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలోనూ, అత్యధిక పరీక్షనిర్వహించిన రాష్ట్రాల జాబితాలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. యాక్టివ్ కేసుల్లో మాత్రం రెండో స్థానంలో ఉంది.