వర్షాల కోసం వరుణ జపం.. రంగంలోకి చిలుకూరు ఆలయ వేద పండితులు!
కరుణించవా వరుణదేవా అంటూ.. దేశమంతా ఆకాశంవైపు దీనంగా చూస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కళ్ల ముందే కారుమబ్బులు కనబడుతున్నా.. చుక్క చినుకు పడటం లేదు. రైతన్నల కంటినీరు జాడలే తప్పా.. ఎక్కడా వరుణిడి జాడ లేదే!. 'ఎల్ నినో' వాతావరణ పరిస్థితుల కారణంగా వర్షపాతం తగ్గడంతో తెలంగాణవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి.
సాధారణం కంటే తక్కువ వర్షాలు కురవడంతో జలాశయాల్లో నీటిమట్టాలు పడిపోయి, సాగునీరు అందక చేతికొచ్చిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. కరువు ఛాయలు అలుముకుంటున్న ఈ క్లిష్ట సమయంలో, ప్రకృతి కోపాన్ని శాంతింపజేసి వరుణదేవుని కరుణ కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు చిలుకూరు బాలాజీ దేవాలయ పండితులు.

ఉస్మాన్సాగర్ జలాశయంలో వైదిక అనుష్ఠానం
రాష్ట్రంలో నెలకొన్న ఈ కరువు పరిస్థితులు తొలగిపోవాలని.. ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ చిలుకూరు బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 8:30 గంటల నుంచి 11:00 గంటల వరకు ఉస్మాన్సాగర్ (గండిపేట) జలాశయంలో ప్రత్యేక 'వరుణ జపం' ఘనంగా నిర్వహించారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ లక్ష్మీనరసింహన్ నేతృత్వంలో ఆలయ అర్చకులు, వేద పండితులు జలాశయంలోని నడుములోతు నీటిలో నిలబడి అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ వైదిక ప్రార్థనలను పూర్తి చేశారు.
108 సార్లు మంత్రోచ్ఛారణలు
వేదభవనంకు చెందిన ప్రముఖ పండితులు డాక్టర్ వి. శ్రీరామ ఘనపాటి నాయకత్వంలో ఋత్వికులు తైత్తిరీయ సంహితలోని అత్యంత శక్తివంతమైన వరుణ జప మంత్రాలను సంప్రదాయబద్ధంగా 108 సార్లు పారాయణం చేశారు. చిలుకూరు బాలాజీ స్వామివారి దివ్య అనుగ్రహంతో వరుణదేవుడు, ఇంద్రదేవుడు ప్రసన్నులై రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిపించాలని ఈ వేదికగా మహా ప్రార్థనలు జరిపారు.
సమాజ శ్రేయస్సే ధ్యేయంగా..
ఈ పవిత్ర వరుణ జపం ద్వారా రాష్ట్రంలోని ఎండిపోతున్న పంటలకు పునరుజ్జీవం కలగాలని, చెరువులు, నదులు, జలాశయాలన్నీ నీటితో కళకళలాడాలని అర్చకులు ఆకాంక్షించారు. రైతాంగం సంతోషంగా ఉంటేనే సమాజ శ్రేయస్సు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. భానుడి భగభగలకు, వర్షాభావానికి ఉపశమనం కలగాలని నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్థానిక భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications