US-Iran: అమెరికా-ఇరాన్ పోరులో నలిగిపోతున్న భారత్..! ట్రంప్ తాజా షాక్...!
అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం (US-Iran War) ముగిసినట్లే ముగిసిన మళ్లీ ప్రారంభం కావడంతో తిరిగి పశ్చిమాసియా రగులుతోంది. ముఖ్యంగా ఇరాన్ హార్ముజ్ జలసంధిలో నౌకలపై జరుపుతున్న దాడులు, వాటికి ప్రతిగా ట్రంప్ (Donald Trump) ఇరాన్ పై జరుపుతున్న దాడులు, దీనికి ప్రతిగా తిరిగి ఇరాన్ గల్ఫ్ దేశాల్లో అమెరికా బేస్ లు, ఆస్తులపై జరుపుతున్న దాడులతో ఈ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో నాలుగు దేశాలు రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం కోసం అమెరికా-ఇరాన్ ను ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రెండు వారాలుగా కొనసాగుతున్న సుదీర్ఘ పోరాటాన్ని తాత్కాలికంగా ముగించడానికి జరుగుతున్న రాయబార ప్రయత్నాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఖతార్, ఒమన్, ఈజిప్ట్ , పాకిస్తాన్ దేశాలు సంయుక్తంగా ప్రతిపాదించిన 10 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆమోదించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించినట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం సైనిక చర్యలను నిలిపివేసే ఆలోచన వైట్ హౌస్ కుప లేదని విశ్లేషకులు చెప్తున్నారు.

ఇరాన్పై భవిష్యత్తులో చర్చలు ప్రారంభించడానికి ముందే సైనికపరంగా మరింత ఒత్తిడిని పెంచాలని, అప్పుడే తమ గొంతు బలంగా వినిపించడానికి అవకాశం ఉంటుందని ట్రంప్ సర్కార్ బలంగా నమ్ముతోంది. జోర్డాన్లో ఇటీవల జరిగిన ఇరాన్ క్షిపణి దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో వైట్ హౌస్ తన పంతాన్ని మరింత కఠినతరం చేసింది. తక్షణమే వెనక్కి తగ్గడం వల్ల తాము బలహీనపడినట్లు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో అగ్రరాజ్యం ప్రతీకార దాడులకే మొగ్గు చూపుతోంది.

ఇరాన్ తో చర్చలకు నో చెబుతూ ట్రంప్ ప్రదర్శిస్తున్న కఠిన వైఖరి ఇప్పుడు భారత్ కు ముప్పుగా పరిణమించే ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచ ఇంధన రవాణాకు జీవనాడి లాంటి హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంపై అటు ఇరాన్ మొండిపట్టు పట్టడం, ట్రంప్ కూడా ఎలాగైనా ఈ జలసంధి తెరిపించేందుకు బలప్రయోగానికి దిగుతుండటంతో భారత్ ఆశలు చిగురించాయి. కానీ ఇప్పుడు మధ్యవర్తిత్వం ద్వారా వచ్చిన సీజ్ ఫైర్ ప్రతిపాదనలకు ట్రంప్ నో చెప్పేయడంతో భారత్ కు తిరిగి చమురు కష్టాలు తప్పేలా లేవు. అదే జరిగితే భారత్ లో మళ్లీ చమురు పొదుపు, ధరల పెరుగుదల వంటి సమస్యలు తప్పవు.


Click it and Unblock the Notifications