ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్... కొత్తగా 837 కేసులు... 200 దాటిన మరణాలు...
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 837 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 8 మంది మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,934కి చేరగా... మృతుల సంఖ్య 206కి చేరింది. గత 24గంటల్లో మొత్తం 38వేలకు పైగా శాంపిల్స్ను టెస్ట్ చేసినట్లు ఆరోగ్యశాఖ బులెటిన్లో వెల్లడించారు. తాజాగా కరోనా సోకినవారిలో 789 మంది ఏపీకి చెందినవారు కాగా,46 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు,ఇద్దరు విదేశీయులుగా గుర్తించారు. ఇవాళ నమోదైన మరణాల్లో కర్నూలు జిల్లాల్లో నలుగురు, చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

ఎమ్మెల్యే రోశయ్యకు పాజిటివ్...
గుంటూరు జిల్లా పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కూడా కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. కరోనా లక్షణాలేవీ లేవని.. అయినప్పటికీ పరీక్షల్లో పాజిటివ్గా తేలిందని చెప్పారు. ప్రస్తుతం హోమ్ క్వారెంటైన్లో ఉన్నట్లు చెప్పారు. ప్రజలకు అందుబాటులోనే ఉంటానని... ఏ సమస్య వచ్చినా తనను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చునని చెప్పారు. అందరి అభిమానంతో త్వరలోనే కోలుకుంటానని విశ్వాసం వ్యక్తం చేశారు.

కలెక్టరేట్లో సమావేశానికి వెళ్లిన రోశయ్య..
కలెక్టరేట్లో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్కి హాజరైన సందర్భంగా కరోనా పాజిటివ్గా తేలిందన్న సమాచారం అందిందని రోశయ్య తెలిపారు. దీంతో కలెక్టర్ వెంటనే ఆయన్ను అక్కడి నుంచి పంపించేశారు. ఎమ్మెల్యే కూర్చున్న చైర్ను శానిటైజ్ చేయించారు. అయితే ఆ కార్యక్రమానికి హాజరైన మిగతా ప్రజా ప్రతినిధుల్లో ఆందోళన నెలకొంది. ముందు జాగ్రత్త చర్యగా వాళ్లు కూడా కరోనా టెస్టులు చేయించుకున్నట్లు సమాచారం.రోశయ్యతో కలిపి ఇప్పటివరకూ మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేలు ఏపీలో కరోనా బారిన పడ్డారు. మొదట విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు, కర్నూలు జిల్లా కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.

మిలియన్ జనాభాకు 18200 టెస్టులు
రాష్ట్రంలో ఇప్పటివరకూ 9.7 లక్షల మందికి కరోనా వైరస్(కోవిడ్-19) నిర్ధారణ పరీక్షల నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్రెడ్డి తెలిపారు. ఒక మిలియన్ జనాభాకు 18200 టెస్టులు చేసినట్లు తెలిపారు. భవన నిర్మాణ రంగం,వ్యవసాయ కూలీలు,కూరగాయలు,పండ్ల మార్కెట్లలో కూలీలకు కూడా టెస్టులు చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకూ 20వేల మంది వలస కూలీలకు పరీక్షలు చేశామన్నారు. ఇందులో 2 వేల మందికిపైగా కోవిడ్ చికిత్సా కేంద్రాల్లో,7వేల మంది ఆస్పత్రుల్లో,హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు చెప్పారు.

అన్ని రంగాల వారికి పరీక్షలు...
‘మార్చి 9న ఏపీలో తొలి కేసు నమోదైంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో మొత్తం 2111 మందికి పాజిటివ్గా నిర్దారణ అయింది. మార్చి 24 వరకు 9 కేసులు వచ్చాయి.. కానీ అన్లాక్ తర్వాత జూన్ 1 నుంచి ఇప్పటివరకూ 13252 కేసులు నమోదయ్యాయి. వివిధ రకాలుగా.. టెస్టింగ్ ఫర్ సర్వైలెన్స్ ఆధారంగా పరీక్షలు చేస్తున్నాం. బయటి నుంచి వచ్చిన వాళ్ళు, అగ్రికల్చర్ లేబర్స్, పండ్ల వ్యాపారులు, పరిశ్రమల్లో కూలీలు, హెల్త్ కేర్, పారిశుద్ధ్య కార్మికులకు పరీక్షలు చేస్తున్నాం. హెల్త్ కేర్ వర్కర్స్ 12500 మందికి పరీక్షలు చేస్తే.. 2.5 % కేసులు పాజిటివ్గా తేలాయి. దేవాలయాలకు వెళ్లిన వారికి పరీక్షలు చేస్తే 1.46 % కేసులు పాజిటివ్గా తేలాయి.' అని జవహర్ రెడ్డి తెలిపారు.
Recommended Video

కొత్త రిక్రూట్మెంట్స్...
'ప్రస్తుత అవసరాల రీత్యా 9 వేల మంది నియామకానికి జాబ్స్ నోటిఫికేషన్ ఇచ్చాం. ఇప్పటికే 22వేల ఐఎంఏ వైద్యులను గుర్తించి శిక్షణ అందిస్తున్నాం. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా చికిత్సకు అనుమతినివ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. అలాగే ప్రజలు కూడా విధిగా మాస్క్ ధరించడం,భౌతిక దూరం పాటించడం చేయాలి. వృద్దులు, పిల్లలను బయటకు పంపించవద్దు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.22శాతం మేర ఇన్ఫెక్షన్ ఉంది.' అని వివరించారు.












Click it and Unblock the Notifications