తల్లిదండ్రులే చచ్చిపొమ్మంటే!.: 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
పశ్చిమగోదావరి: జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు ఏదో కోపంలో అన్న మాటలను తీవ్రంగా తీసుకున్న ఓ 14ఏళ్ల బాలిక బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ఆ కుటుంబంతోపాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. జంగారెడ్డిగూడెంపట్టణానికి చెందిన విద్యార్థిని వామిశెట్టి భవాని(14) శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడింది.
గీత కార్మికుడైన ఆమె తండ్రి కైలాబ్ బయటకు వెళ్లగా, తల్లి వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లింది. వారు తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి విగతజీవిగా తమ కుమార్తె పడి ఉండటంతో వెంటనే జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే భవాని మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 'నన్ను చచ్చిపొమన్నారుగా' అని భవానీ రాసిపెట్టిన సూసైడ్ నోట్ ఘటనా స్థలం వద్ద పోలీసులకు లభించింది.
కాగా, 'నాన్నా నన్ను చచ్చిపోమన్నావుగా, అమ్మా నువ్వు కూడా నన్ను చచ్చిపోతే బాగుంటుంది అన్నావు. అందుకే చచ్చిపోతున్నాను' అని రాసిపెట్టిన భవానీ తన ప్రాణాలు తీసుకుంది. భవాని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.