దారుణం: తండ్రి సహకారంతో మైనర్ బాకలిపై 10రోజులపాటు బాలుడు అత్యాచారం
చిత్తూరు: జిల్లా సత్యవేడు మండల పరిధిలోని చెరివి గిరిజన కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాలనీకి చెందిన 13 ఏళ్ల బాలికపై అదే మండలం రామచంద్రాపురం గిరిజన గ్రామానికి చెందిన 16ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా, ఆ బాలుడికి కన్న తండ్రే ఈ ఘాతుకానికి సహకరించడం దారుణమైన విషయం.
కాగా, ఘటనపై తమకు ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. బాలిక ఒంటరిగా ఇంటిలో ఉన్న సమయంలో రామచంద్రాపురం గిరిజన కాలనీకి చెందిన బాలుడు, బాలుడితో పాటు తండ్రి, చిన్నాన్నలు రెండు ద్విచక్ర వాహనాలలో వచ్చి నవంబర్ 17వ తేదీన బలవంతంగా బాలికను తీసుకెళ్లారు.
అక్కడ నుంచి తమిళనాడు ఆరంబాకం సమీపంలోని చెల్లాతమ్మ గిరిజన కాలనీలోని ఓ ఇంట్లో నిర్బంధించి 10 రోజులపాటు తనపై అత్యాచారం చేసి తనను సత్యవేడు సమీపంలో వదిలిపెట్టారని బాలిక తెలిపిందన్నారు.
దీనిపై బాలిక తల్లిదండ్రులు సర్పంచ్ రామయ్యతో కలసి తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ సంఘటనపై విచారణ జరిపి కేసులో బాలుడికి సహకరించిన తండ్రి, చిన్నాన్నపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.