మనసు పారేసుకుంది: తనతో రమ్మంటూ చిత్తూరు యువకుడి ఇంటికెళ్లిన చైనా యువతి
చిత్తూరు: జిల్లాకు చెందిన ఓ యువకుడిని ప్రేమించిన ఓ చైనా యువతి.. తనతో రావాలంటూ అతని ఇంటికెళ్లింది. ఆశ్చర్యపోయిన కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు.. ఆ యువతిని చైనాకు పంపించే ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ తతంగమంతా జరుగుతున్నంత సేపు ఆ యువతి ప్రేమించిన యువకుడు మాత్రంలో పరారీలో ఉన్నాడు.
వివరాల్లోకి వెళితే.. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడానికి చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని కల్కి ఆశ్రమానికి జింగ్ జుంగ్ జాంగ్ (28) అనే యువతి చైనాను నుంచి వచ్చింది. కాగా, వరదయ్యపాళెం మండలంలోని బత్తలవల్లం గ్రామవాసి, కల్కి ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న భాస్కర్ యాదవ్ కుమారుడు మునిరాజ(22) సూళ్లురుపేట గోకులకృష్ణ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేశాడు.
ఆ యువతికి, ఇతనికీ మధ్య నిరుడు స్నేహం కుదిరింది. ఈ క్రమంలో తనతో చైనాకు వచ్చేయాలని ఆ యువతి మూడు రోజుల క్రితం మునిరాజ ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులకు తన మనసులోని మాట చెప్పింది. దీంతో మునిరాజ కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. విషయం తెలిసిన మునిరాజ పరారయ్యాడు. కాగా, ఈ సంగతి పోలీసుల దృష్టికి వెళ్లింది.
అయితే చైనా అమ్మాయికి సంబంధించిన అంశంలో తమ ఆశ్రమానికి ఎలాంటి సంబంధం లేదని, ప్రస్తుతం ఆమె తమ ఆశ్రమంలో లేదని కల్కి ఆశ్రమ ఇంఛార్జ్ లోకేష్ మీడియాకు తెలిపారు. ఇది ఇలావుండగా, చైనా యువతి మునిరాజు కుటుంబానికి 10 లక్షల రూపాయల వరకు సహాయం చేసిందని గ్రామంలో ప్రచారం జరుగుతోంది.
కాగా, పోలీసులు, చైనా ఎంబసీ అధికారులు, భారతదేశంలో ఉన్న చైనా యువతి గైడ్ డానీ జోక్యం చేసుకుని ఆ యువతిని స్వదేశం పంపేందుకు ఆమెను అంగీకరింపజేశారు. చైనా యువతితో సంబంధం పెట్టుకున్న మునిరాజాను సోమవారం నాడు వరదయ్యపాళెం పోలీసులు విచారించనున్నారు.