చర్చి పాస్టర్ దారుణం: ప్రేమ పేరుతో బాలికను కిడ్నాప్ చేశాడు, చివరకు
విజయవాడ: ఓ పాస్టర్ దారుణానికి పాల్పడ్డాడు. ఆరోగ్యం బాగోలేదని చర్చికి తీసుకెళ్లిన మైనర్ బాలికను స్వస్థత పేరుతో ట్రాప్ చేశాడు పాస్టర్. మాయమాటలతో లోబర్చుకుని మూడు రోజుల క్రితం బాలికను అపహరించాడు. నూజివీడులో చర్చి పాస్టర్గా ఉన్న వ్యక్తి మైనర్ను కిడ్నాప్ చేయడం స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లాకు చెందిన నిందితుడు నాగేశ్వర్ భార్య అనారోగ్యంతో చనిపోయింది. అతనికి సుమారు 20 ఏళ్ల వయస్సున్న ఇద్దరు పిల్లలున్నారు. నూజివీడులో చర్చికి వచ్చిన బాలికను స్వస్థత పేరుతో మాయమాటలతో లోబర్చుకున్నాడు. ఇది తెలిసిన తల్లిదండ్రులు ఆమెను గత కొన్ని రోజులుగా గన్నవరం మండలం ఉస్తాబాద్ గ్రామంలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంచారు.
అయితే, బాలిక జాడ తెలసుకున్న పాస్టర్ నాగేశ్వర్ డిసెంబర్ 2న ఉస్తాబాద్ వచ్చి బాలికను తీసుకెళ్లాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన గన్నవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగేశ్వర్ తోపాటు బాలిక కూడా హైదరాబాద్ లో ఉన్నట్లు తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు.
మంగళవారం నాగేశ్వర్, బాలికను గన్నవరం పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. బాలిక క్షేమంగా తన ఇంటికి చేరడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారరు.