అమెరికాలోని మంచు సరస్సులో జారిపడి ఏపీకి చెందిన దంపతులు మృతి.. అనాధలైన చిన్నారులు!!
అమెరికాలో ఒకపక్క బాంబు తుఫాను బీభత్సం సృష్టిస్తున్న క్రమంలో, మరోపక్క ఫీనిక్స్ వద్ద మంచు సరస్సులో తెలుగు దంపతులతో పాటు మరో వ్యక్తి గల్లంతైన సంఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెదనందిపాడు పాలపర్రు గ్రామానికి చెందిన నారాయణ, హరిత దంపతులు విహార యాత్రకు వెళ్లి సరస్సులోకి జారిపడి గల్లంతైన ఘటన విషాదాంతంగా మారింది.
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రు గ్రామానికి చెందిన నారాయణ, హరితలు గత 14 సంవత్సరాలుగా ఆరిజోనాలో స్థిరపడ్డారు. మంగళవారం ఈ దంపతులిద్దరూ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఫినిక్స్ పర్యటనకు వెళ్లారు. మంచు సరస్సును చూస్తుండగా, వారు మంచు సరస్సులోకి జారి పడిపోయారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు సహాయక చర్యలను ప్రారంభించి మంచు సరస్సులో పడి గల్లంతైన దంపతులలో ఒకరైన హరిత మృతదేహాన్ని వెలికి తీశారు.
నారాయణ మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంచు సరస్సులో పడి గల్లంతైన తల్లిదండ్రుల కోసం వారి ఇద్దరు కుమార్తెలు దీనంగా రోదిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దంపతులు మంచు సరస్సులో ప్రమాద ఘటనలో గల్లంతు కావడంతో వారి కుటుంబ సభ్యులలో విషాదం చోటుచేసుకుంది. నారాయణ తల్లిదండ్రులు వెంకటసుబ్బారావు, వెంకటరత్నం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సామాన్య కుటుంబంలో జన్మించిన నారాయణ కష్టపడి ఎమ్మెస్సీ చదువుకుని ఆ తర్వాత మలేషియాలో కొన్నాళ్లపాటు ఉద్యోగం చేసి ఆపై అమెరికాకు వెళ్లి ఆరిజోనా లో స్థిరపడ్డారు.
ఆయన ఎప్పుడూ పాలపర్రు వచ్చినా గ్రామంలో అందరితో చనువుగా ఉండేవారని, ఎంతో సౌమ్యుడు అని గ్రామస్తులు చెబుతున్నారు. సెలవులు కావడంతో విహారయాత్రకు వెళ్లి ఇలా తమ కుమారుడు, అతని భార్య గల్లంతు కావడం పై తల్లిదండ్రులు రోదిస్తున్నారు. ఇక నారాయణ మృతదేహం కోసం సరస్సులో గాలింపు కొనసాగుతోంది. వీరితో పాటు విశాఖకు చెందిన మరొక వ్యక్తి కూడా గల్లంతయ్యారు అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.