బాలికపై తండ్రి రేప్యత్నం: వేధిస్తున్న వ్యక్తిపై కేసు
పోలీసుల కథనం ప్రకారం... ఎల్బినగర్ రాజీవ్నగర్లో నివాసం ఉంటున్న దంపతులకు ఓ కూతురు(13), కుమారుడు ఉన్నారు. బాలిక తండ్రి కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఏ పనీ చేయకుండా తిరుగుతుంటాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న అతని కూతురు ఆదివారం కావడంతో ఇంట్లోనే ఉంది.
ఆ సమయంలో ఇంటి వెనక భాగంలో ఆమె తల్లి వంట సామాగ్రిని శుభ్రం చేస్తోంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన బాలిక తండ్రి కూతురిపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక అరవడంతో ఆమె తల్లి పరుగెత్తుకుంటూ వచ్చింది. ఇరుగుపొరుగువారిని పిలవడంతో అతడు పరారయ్యాడు. దీనిపై బాలిక తల్లి ఎల్బినగర్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇది ఇలా ఉండగా మరో ఘటనలో బాలికలను వేధింపులకు గురిచేస్తున్న ఓ యువకుడిపై ఎస్సార్నగర్ పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బోరబండ సాయిబాబానగర్కు చందు(21) స్థానికంగా నివసించే ఓ బాలికను పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. అతని వేధింపులను తట్టుకోలేక ఇద్దరు బాలికలు చదువు కూడా మానేశారు. తాజా మరో బాలికను వేధిస్తుండటంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చందుపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.