చాక్లెట్ల కోసం బయటికెళ్లి అదృశ్యం: కాల్వలో శవమైన చిన్నారి పూజిత
తూర్పుగోదావరి: రెండ్రోజుల క్రితం అదృశ్యమైన చిన్నారి పూజిత(7) కాల్వలో శవమై తేలింది. దీంతో ఆమె కుటుంబంతోపాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. కిర్లంపూడి మండలం వీరవరానికి చెందిన పూజిత.. పెద్దాపురం మండలం చదలాడలోని తాతయ్య ఇంటికి వచ్చింది.
బుధవారం ఇంటి వద్ద ఆడుకుంటున్న పూజిత చాక్లెట్ కొనుక్కొని వస్తానంటూ సమీపంలోని దుకాణానికి వెళ్లింది. ఎంతసేపటికీ రాకపోవడంతో బాలిక తాతయ్య పరిసరాల్లో వెతికి చివరికి పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Also Read: దారుణం: పొలాల్లోకి తీసుకెళ్లి కన్నకూతురుపై తండ్రి అత్యాచారం
కాగా, శుక్రవారం ఉదయం పెద్దాపురం మండలం బి.తాటిపర్తిలోని ఏలూరు కాలువలో బాలిక మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని కుటుంబసభ్యులు గుర్తించడంతో పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
పూజిత కాలువలో ప్రమాదవశాత్తూ పడి మృతిచెందిందా? లేదా ఎవరైనా హత్య చేసి కాలువలో పడేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అగ్ని ప్రమాదంలో చిన్నారి మృతి
కర్నూలు జిల్లా నంద్యాల హరిజనవాడలో జరిగిన అగ్నిప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృతిచెందింది. హరిజనవాడలోని బ్రహ్మయ్య నివాసంలో శుక్రవారం ఉదయ విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. దీంతో కుటుంబసభ్యులంతా బయటకు వచ్చేశారు.
ఇంట్లోని కొన్ని ముఖ్యమైన వస్తువులను తెచ్చేందుకు బ్రహ్మయ్య ఇంట్లోకి వెళ్లగా చిన్నారి కూడా తండ్రిని అనుసరిస్తూ లోనికి వెళ్లింది. మంటల వేడిమికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.