హుస్సేన్సాగర్లో శవమై తేలిన ఎంసిఏ విద్యార్థిని
హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ఎంసిఏ విద్యార్థిని హుస్సేన్ సాగర్లో శవమై తేలింది. మొగల్పురా పోలీసుల కథనం ప్రకారం.. శాలిబండ నాగులచింత ప్రాంతానికి చెందిన దినేష్ కుమార్ కుమార్తె వివి నిఖిత(24) ఉస్మానియా యూనివర్సిటీలో ఎంసిఏ చదువుతోంది.
అక్టోబర్ 26వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన నిఖిత తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మంగళవారం రాత్రి నిఖిత మృతదేహం రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని హుస్సేన్సాగర్లో తేలియాడుతూ కనిపించింది. ఆమెది ఆత్మహత్యా లేక హత్యా అనేది తెలియరాలేదు.
చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి చెరువులో పడి మృతి
తల్లికి చేపల కూర పెట్టాలనే ఆలోచనతో చేపలను పట్టేందుకు వెళ్లి చెరువులోపడి ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీకి చెందిన మేకల రమేష్(35) చేపలు పడుతుంటాడు. లింగంపల్లిలో ఉంటున్న తల్లి తన ఇంటికి వస్తోందని, ఆమెకు చేపల కూర తినిపించాలని తన భార్యకు చెప్పాడు.
ఆ తర్వాత చేపల్ని పట్టేందుకు కోసం మంగళవారం రాత్రి గోపీచెరువులో వలవేసేందుకు వెళ్లాడు. వల వేయడానికి వెళ్లిన రమేష్.. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. రమేష్ ఎంతకూ ఇంటికి రాకపోవడంతో అతని భార్య, బంధువులతో కలిసి వెళ్లి చెరువులో చూడగా మృతదేహం కనిపించింది.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కృష్ణా: జిల్లాలోని పెనమలూరు మండలం గంగూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రావిశెట్టి భూలక్ష్మి(30) మృతి చెందింది. కంకిపాడు నుంచి ప్రయాణికులతో పోరంకి వస్తున్న ఆటోను గంగూరు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న భూలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఐదుగురు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.