బంగాళాఖాతంలో అల్పపీడనం దెబ్బ తీవ్రత- ఏపీలో వర్షాలు
Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. ఏపీ దక్షిణ కోస్తా- తమిళనాడు ఉత్తర ప్రాంత తీరం వెంబడి నైరుతి, పశ్చిమ- మధ్య బంగాళాఖాతంలో స్థిరంగా ఉన్న ఈ అల్పపీడనం ఈ సాయంత్రానికి బలహీనపడుతుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
దీని ప్రభావంతో ఈ నెల 27వ తేదీ వరకు ఏపీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ ఆవర్తనం ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ- మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారడానికి అనుకూల వాతావరణం ఏర్పడింది.

దీని ప్రభావంతో నేడు, రేపు ఏపీ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది.
26వ తేదీన ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, కడప, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయి. 27వ తేదీన ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. 28వ తేదీన వాతావరణం పొడిగి ఉంటుంది.












Click it and Unblock the Notifications