బంగాళాఖాతంలో వాయుగుండం- ఏపీలో అతి భారీ వర్షాలు
Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఏపీలో వచ్చే రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒడిశా దక్షిణ ప్రాంత జిల్లాల్లో వర్షాల తీవ్రత ఉంటుందని పేర్కొంది.
బంగాళాఖాతంలో నైరుతి దిశగా పశ్చిమ- మధ్య ప్రాంతంలో ఈ అల్పపీడనం స్థిరంగా ఉంది. శుక్రవారం రాత్రి 11:30 గంటల సమయానికి విశాఖపట్నానికి 370, చెన్నైకి 450, ఒడిశాలోని గోపాల్పూర్కు 640 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. క్రమంగా ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతుందని ఈ సాయంత్రానికి వాయుగుండంగా మారుతుందని ఐఎండీ అంచనా వేసింది.

దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. నేడు ఈ ఉపరితల ఆవర్తనం ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ- మధ్య బంగాళాఖాతంలో వాయుగుండగా మారడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది.
దీని ప్రభావంతో నేడు, రేపు ఏపీ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అంచనాలకు మించిన వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉండొచ్చని వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఈ అల్పపీడనం వల్ల నేడు శ్రీకాకుళం, విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిస్తాయి. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది.

ఏలూరు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చు. శని, ఆదివారాల్లో తీర ప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంపైకి చేపల వేటకు వెళ్లకూడదని ఐఎండీ సూచించింది.
ఈ నెల 23వ తేదీ ఉదయం వరకు తీర ప్రాంతంలో 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. దీని తీవ్రత 65 కిలో మీటర్ల వరకూ పెరిగే అవకాశం ఉంది. ఒడిశా దక్షిణ ప్రాంతం నుంచి ఏపీ మీదుగా తమిళనాడు వరకు తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications