అనుమానం: భార్యను బీరు బాటిల్తో పొడిచిన భర్త
నెల్లూరు: జిల్లాలోని దత్తలూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. అనుమనాంతో ఓ భర్త తన భార్యను బీరు బాటిల్తో పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన ఆ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సంగం మండలం అన్నారెడ్డిపాళెంకు చెందిన మణి, ప్రభావతమ్మ (38) అనే దంపతులు దుత్తలూరులో ధనుంజయ అనే రైతు వేసిన మినుము పంటకు కాపలాగా వచ్చారు.
సోమవారం రాత్రి మణి మద్యం మత్తులో భార్యను బీరు బాటిల్తో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మణి భార్య ప్రవర్తనపై అనుమానంగా ఉండేవాడు.
సోమవారం రాత్రి ఇరువురు మద్యం సేవించి ఉన్నట్లుగా తెలుస్తోంది. భార్యపై ఉన్న అనుమానంతో మణి ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేశారు.
మద్యం మత్తులో మహిళపై దాడి
నెల్లూరు నగరంలోని బుజబుజనెల్లూరు గ్రామంలో ఆంజనేయస్వామి గుడి దగ్గర మద్యం మత్తులో ఓ వ్యక్తి దాడికి దిగాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. బుజబుజ నెల్లూరులోని ఆంజనేయస్వామి గుడి వద్ద బస్సు కోసం అక్కడ నిలబడి ఉన్న లక్ష్మిదేవిపై అటుగా వస్తున్న ఎస్కె హుస్సేన్ మద్యం సేవించి గొడవకు దిగాడు.
ఈ క్రమంలో బండరాయితో లక్ష్మిదేవి తలపై గట్టిగా కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అక్కడే ఉన్న స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వారు తెలిపిన సమాచారం మేరకు ఐదో నగర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.