ఆస్తి కోసం వదినను చంపిన మరిది: భర్త మందలించాడని ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య
కర్నూలు: ఆస్తి కోసం ఓ వ్యక్తి సొంత వదినను నరికి చంపాడు. కర్నూలు జిల్లాలోని రుద్రవరం మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానిక పడమట వీధికి చెందిన బోయ వెంకట లక్ష్మమ్మ(50) భర్త ఐదేళ్ల క్రితం మృతి చెందాడు. ఆ దంపతులకు పిల్లల్లేరు.
దీంతో వారికి ఉన్న ఆస్తిని తన పిల్లల పేరిట రాసివ్వాలని ఆమె మరిది నర్సింహుడు కొన్ని రోజులుగా గొడవపడుతున్నాడు. ఈ నేపథ్యంలో వెంకట లక్ష్మమ్మ సోమవారం సాయంత్రం స్థానిక సంతకు వెళ్లి వస్తుండగా నర్సింహుడు ఆమెను గొడ్డలితో నరికాడు.
తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నిందితుడు అక్కడ్నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బొమ్మిలింగానికి చెందిన గోదేశి రంగారావు, మణమ్మ(30) భార్యాభర్తలు. పిల్లలు హేమ (3), పూజిత (4)లకు అనారోగ్యంగా ఉండటంతో భార్యను పొలానికి రావద్దని చెప్పి వెళ్లాడు. అమె పిల్లలతో పొలానికి రావడంతో మందలించాడు. దీంతో రమణమ్మ ఇంటికి వెళ్లి పిల్లలకు పురుగుమందు తాగించి తానూ తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
ట్రాక్టర్ ఢీకొని మహిళ దుర్మరణం
సైకిల్ను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం మంగలి గుంటపాలెం గ్రామానికి చెందిన ఎస్తేర్రాణి(36) సోమవారం సాయంత్రం కుమారుడితో కలిసి సైకిల్పై వెళ్తోంది.
ఎదురుగా వేగంగా వచ్చిన ట్రాక్టర్ వారిని ఢీకొట్టటంతో ఎస్తేర్రాణి అక్కడికక్కడే మరణించింది. గాయపడిన ఆమె కుమారుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications