ప్రేమించి పెళ్లి, అనుమానంతో భార్య హత్య: తండ్రిని పట్టించిన కొడుకు
కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త.. ఆమెను దారుణంగా కొట్టి చంపాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని వేరేచోటికి తీసుకెళ్లి తగలబెట్టాడు.
గుంటూరు: కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త.. ఆమెను దారుణంగా కొట్టి చంపాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని వేరేచోటికి తీసుకెళ్లి తగలబెట్టాడు. అయితే, ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు అసలు విషయాన్ని తేల్చి, నిందితుడ్ని కటకటాల వెనక్కి నెట్టారు. గుంటూరు జిల్లాలోని సంతనూతలపాడులో చోటు చేసుకుందీ ఘటన.
వివరాల్లోకి వెళితే.. సంపత్నగర్కు చెందిన బద్రి రాఘవయ్య, కల్యాణిలకు (39) కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం కావడం గమనార్హం. వీరికి దుర్గశ్రీ, దినేష్ సంతానం. వీరిద్దరు వేర్వేరు సామాజికవర్గాలకు చెందినవారు కావడంతో రాఘవయ్య కుటుంబసభ్యులు అతడికి సుజాత అనే మరో మహిళతో వివాహం చేశారు. సుజాతకు భానుప్రకాష్, లిఖిత అనే ఇద్దరు సంతానం.
వ్యసనాలకు బానిసైన రాఘవయ్య తరచూ కల్యాణితో గొడవ పడేవాడు. కల్యాణి గుంటూరు -1 డిపోలో కండక్టరుగా పనిచేస్తోంది. కొద్ది నెలల కిందట రాఘవయ్య రెండో భార్య సుజాత అనారోగ్యంతో మృతి చెందింది. ఇటీవల రాఘవయ్య అనారోగ్యం తీవ్రం కావడంతో హైదరాబాదులోని ఆర్ర్టీసీ ఆసుపత్రిలో కల్యాణి ఆపరేషన్ చేయించింది. అప్పటి నుంచి అతను గుంటూరులోని ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు.
అయితే కల్యాణి తన పిల్లలైన దుర్గశ్రీ, దినేష్లను హైదరాబాద్లోని తన చెల్లెలు శర్వాణి ఇంటికి పంపించింది. ఇది రాఘవయ్యకు నచ్చలేదు. పిల్లల్ని హైదరాబాద్ నుంచి పిలిపించాలని భార్యపై ఒత్తిడి తెచ్చాడు. దీంతోపాటు ఆమె ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ తీవ్రంగా కొట్టాడు. ఆదివారం రాత్రి వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన రాఘవయ్య రోకలిబండతో కల్యాణి తలపై మోదాడు. ఆ తర్వాత రక్తపు మడుగులో పడి ఉన్న కల్యాణిని గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని ఎవరికి అనుమానం రాకుండా ఇంటి పక్కనే ఉన్న గుంతలో పడేశాడు.
అనంతరం గత ఆదివారం అర్ధరాత్రి అక్కడి మృతదేహాన్ని బయటకు తీసి గోతంలో కట్టి ఆటోలో బొంతపాడు శ్మశాన వాటికకు తీసుకెళ్ళి పెట్రోలు పోసి దహనం చేశారు. మృతురాలి అన్నయ్య మధుసూదనరావు తన చెల్లెలు అదృశ్యమైందని సోమవారం లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకేమీ తెలియనట్లు సోమవారం గ్రీవెన్సులో భార్య అదృశ్యమనట్లు రాఘవయ్య కూడా ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో హైదరాబాద్లో ఉంటున్న పిన్ని శర్యాణి వద్ద నుంచి రాఘవయ్య కుమారుడు దినేష్(కల్యాణి కొడుకు) ఆదివారం ఇంటికి రాగా ఆవరణలో రక్తపు మరకలు కన్పించాయి.
వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయట పడింది. బొంతపాడు శ్మశాన వాటిక నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాఘవయ్యను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుతో సంబంధమున్న తల్లి ధనమ్మ, సోదరుడు శ్రీనివాసరావు, చెల్లెలు పద్మలతో పాటు రెండో భార్య సుజాత కుమారుడు భాను ప్రకాశ్లను అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ సంతోష్కుమార్ తెలిపారు. సమావేశంలో సీఐ తిరుమలరావు, ఎస్సై కృష్ణారెడ్డి పాల్గొన్నారు.