దారుణం: అర్ధరాత్రి ఇంట్లోని భార్య, ఇద్దరు కూతుళ్లను చంపేశాడు
అనంతపురం: జిల్లాలోని తాడిపల్లి కృష్ణాపురంలో సోమవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న తన భార్య, ఇద్దరు కుమార్తెలను సుత్తితో మోది చంపేశాడో దుర్మార్గుడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
సోమవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో భార్య సులోచన(55), కుమార్తెలు ప్రసన్న(22), ప్రతిభలపై సుత్తితో దాడి చేశాడు రామసుబ్బారెడ్డి. దీంతో సులోచన, ప్రసన్న అక్కడికక్కడే మరణించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రతిభ మృతి చెందింది.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒకే కుటుంబంలో ముగ్గురు హత్యకు గురవడంతో వారి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, హత్యలు చేసిన అనంతరం రామసుబ్బారెడ్డి పరారయ్యాడు. కాగా, దాడి జరిగిన సమయంలో ఇంట్లో లేని మరో కూతురు ప్రత్యూష ప్రాణాలతో బయటపడింది.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలంలో మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సులోచన, రామసుబ్బారెడ్డి తరచూ గొడవపడుతుండేవారని, ఈ క్రమంలోనే అతడు హత్యలు చేసివుంటారని అనుమానిస్తున్నారు.