ప్రాణం తీసిన నోటి దురుసు: స్నేహితులే హంతకులు
అల్వాల్, లోతుకుంట ప్రాంతాల్లో నివాసముంటున్న యోగి, రాజు, కిరణ్, వంశీలు స్నేహితులు. లోతుకుంట నుంచి నాగదేవత ఆలయం వెళ్లే రైల్వే ట్రాక్ దగ్గర వీరు తరచూ మద్యం, గంజాయి, మత్తు పదార్థాలను సేవిస్తుండేవారు. రోజులానే ఆదివారం కూడా రైల్వే ట్రాక్ దగ్గరకు చేరుకున్నారు. అందరూ కలిసి మద్యం సేవించడం మొదలుపెట్టారు.
సంభాషణల మధ్యలో కిరణ్ మద్యం మత్తులో ఇతర స్నేహితుల తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లల గురించి అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ముగ్గురు స్నేహితులు కిరణ్పై కంకర రాళ్లను రువ్వి, పెద్ద బండరాయితో మోది హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారంతో ట్రాక్ దగ్గర శవం పడి ఉందని తెలుసుకున్న తిరుమలగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు లభించిన ఆధారాలతో యోగి, వంశీ, రాజులను అదుపులోకి తీసుకుని సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్న కిరణ్, తమ బంధువు గంజాయి వ్యాపారానికి అడ్డుగా ఉన్నాడనే హత్య చేశారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.