ప్రేమలో పడిందని! కూతుర్ని అడవిలోకి తీసుకెళ్లి దారుణంగా చంపేశాడు
బెంగళూరు: తమ కూతురు ఓ యువకుడితో ప్రేమాయాణం సాగిస్తుందన్న విషయాన్ని జీర్ణించుకోలేని ఓ తల్లిదండ్రులు ఆమెను దారుణంగా హత్య చేశారు. కని..పెంచి పెద్ద చేసిన వారు తమ ప్రేమను పక్కన పెట్టి.. పరువే ముఖ్యమని ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. కర్ణాటకలోని పావగడ తాలూకా కిలార్లహళ్లిలో 8నెలల క్రితం జరిగిన ఈ దారుణం ఒక రోజు క్రితం వెలుగుచూసింది.
పావగడ సీఐ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా మడకశిర మండలం తిరుమలదేవరపల్లి (టీడీపల్లి) తాండాకు చెందిన శంకరనాయక, గౌరమ్మ కుమార్తె చరిత(22) అదే గ్రామానికి చెందిన వరుసకు మామ అయిన ఆనందనాయక అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న శంకరనాయక కుమార్తెను మందలించాడు. కొన్నాళ్ల పాటు కూతుర్ని బంధువుల ఇళ్లలో ఉంచాడు. అయినా ఆమె మనసు మారలేదు. దీంతో కుమార్తెను చంపాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం కర్ణాటకలోని పావగడ తాలూకాలోని తన అత్త ఊరు కిలార్లహళ్లికి తీసుకెళుతున్నానని చెప్పి గత సెప్టెంబర్ 22న కుమార్తెతోపాటు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు.
కిలార్లహళ్లి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి రాగానే గొంతుకు చున్నీ బిగించి, తలపై బండ రాయితో మోది ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. గుర్తు తెలియని యువతి హత్యకు గురైనట్లు కేసు నమోదు చేసుకున్నారు.
ఆ తర్వాత ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఓ వ్యక్తి అందించిన సమాచారంతో హత్యకు గురైంది చరిత అని, హంతకుడు తండ్రేనని నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో నిందితుడ్ని బుధవారం అరెస్ట్ చేశారు. సమాజంలో తనకు చెడ్డ పేరు తెస్తుందన్న ఉద్దేశంతోనే హత్య చేశానని నిందితుడు ఒప్పుకొన్నట్లు సీఐ ఆనంద్ పేర్కొన్నారు. నిందితుడిని పావగడ కోర్టులో హాజరు పరచగా రిమాండ్కు తరలించినట్లు చెప్పారు.