మద్యం మత్తులో భార్యను చితకబాది, పురుగుల మందు తాగించాడు
ఖమ్మం: జిల్లాలోని జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను తీవ్రంగా కొట్టిన ఓ భర్త ఆమె నోట్లో పురుగులు మందు పోసి ఆమె మృతికి కారణమయ్యాడు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బూరుగు నర్సమ్మ(32), ముక్తేశ్వరరావు భార్యాభర్తలు. మద్యం తాగి వచ్చిన ముక్తేశ్వరరావు బుధవారం రాత్రి అతని భార్యను తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా ఆమెకు బలవంతంగా పురుగుల మందు తాగించాడు.
దీంతో నర్సమ్మ తీవ్ర అస్వస్థతకు గురైంది. గమనించిన ఇతర కుటుంబసభ్యులు నర్సమ్మను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గురువారం చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన నర్సమ్మ తరపు బంధువులు ముక్వేశ్వరరావుకు దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
కాల్పులు జరిపి దోపిడీ
మహబూబ్నగర్ జిల్లాలో గురువారం కాల్పులు కలకలం చెలరేగింది. ఆసరా పింఛన్లు పంపిణీ చేసేందుకు వెళుతున్న బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బిపిఎం) శిరీషను ఓ దుండగుడు రివాల్వర్తో బెదిరించాడు. అనంతరం గాల్లో రెండు రౌండ్లు కాల్పులు జరిపి... ఆమె వద్ద నుంచి రూ. లక్షా 50వేలు తీసుకుని పరారయ్యాడు. ఈ సంఘటన వనపర్తి మండలం ఖాసింనగర్ లో చేటుచేసుకుంది.
గోపాలపట్నం మండలం జైళ్ల తిరుమలాపురానికి చెందిన బిపిఎం శిరీష మరో యువకుడితో కలసి బైక్పై వెళుతుండగా వనపర్తి మండలం కాశీనగర్ దగ్గర ఓ వ్యక్తి రివాల్వర్తో బెదిరించి 1.50లక్షల నగదు దోచుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.