ఇద్దరు భార్యల మొగుడు: ఆస్పత్రిలో భార్య గొంతు నులిమి..
విజయవాడ: ఆస్పత్రిలోని ఓ దుర్మార్గుడు తన మొదటి భార్య గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించాడు. వివరాలు ఇలా ఉన్నాయి - భర్త వేధింపులు భరించలేక ఆమె ఒంటికి నిప్పంటించుకుంది. తీవ్రమైన కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరింది. అయినా ఆమెను అతను వదల్లేదు.
నువ్వింకా చావలేదా అంటూ గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. కృష్ణాజిల్లా ఎ.కొండూరు మండలంలోని పూలచెట్టుపాడుకు చెందిన కొమ్ము రమేష్ మొదటి భార్య కొన్నేళ్ల క్రితం నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆరేళ్ల క్రితం రాణిని రెండో వివాహం చేసుకున్నాడు. అయితే ఆ రాక్షసుడు కొద్దిరోజులుగా రాణిని వేధింపులకు గురిచేస్తున్నాడు.
ఆ వేధింపులకు తాళలేక ఆమె బుధవారం నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్రంగా గాయపడిన రాణిని బంధువులు తిరువూరు ఆస్పత్రికి తీసుకెళ్లగా విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో మూడు రోజుల క్రితం ఆమెను ఆ ఆస్పత్రికి తరలించారు.
రాణిని చూసేందుకని ఆదివారం ఆస్పత్రికి వచ్చిన రమేష్ - గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. రాణి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నవ వధువు సహా ఐదుగురు మృతి
ప్రకాశం జిల్లా కొరిశపాడు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధువుతో సహా ఐదుగురు మృతి చెందారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. విశాఖపట్నం జిల్లా గాజువాక ప్రాంతంలోని అక్కిరెడ్డిపాలానికి చెందిన డొక్కల స్వాతికి ఈనెల 2న రామకృష్ణతో వివాహం జరిగింది. ఇరు కుటుంబాల వారు మొక్కు తీర్చుకునేందుకు తిరుపతికి బయల్దేరారు.
ఆదివారం మధ్యాహ్నం వారు ప్రయాణిస్తున్న వాహనం కొరిశపాడు సమీపంలోని జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జి దిగే సమయంలో ఆగి ఉన్న పాల ట్యాంకర్ను ఢీకొట్టింది. దీంతో నూతన వధువు స్వాతి, యర్రబాల సింహాద్రి (40) అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్తోపాటు మరో 13 మందికి తీవ్ర గాయాలు కావడంతో రిమ్స్కు తరలించారు. డొక్కల గోవిందమ్మ (35), ప్రసన్నకుమార్ (22) కల్యాణ్ (21) మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది.