రాయలసీమ నెత్తిన పాలు పోసిన నరేంద్రమోడీ.. భారీ వరం
కేంద్రంలో, రాష్ట్రంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులను సాధించుకురాగలిగే బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలకు అప్పగించారు. ఇందులో భాగంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ను కలిశారు. తిరుపతికి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న పాకాల రైల్వేస్టేషన్ ను జంక్షన్ అభివృద్ధి చేయాలని కోరారు. అంతేకాకుండా ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, అందుకు తగిన అవకాశాలను ఆయన మంత్రికి వివరించారు.
ఈనెల తొమ్మిదిన పాకాలపై జరిగిన సమావేశం
ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావల్సిన అనుమతులన్నీ త్వరితగతిన వస్తాయని ఆయన మంత్రికి హామీ ఇచ్చారు. దీంతో మంత్రి అశ్వనీ వైష్ణవ్ వచ్చే ఏడాది మార్చి నుంచి పాకాల స్టేషన్ ను అభివృద్ధి పరిచే పనులు ప్రారంభిస్తామని, స్టేషన్ ను పూర్తిగా ఆధునికీకరిస్తామని, స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎనిమిది లైన్లను నిర్మించడంతోపాటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వాస్తవానికి ఈనెల తొమ్మిదోతేదీన పాకాల రైల్వేస్టేషన్ కు సంబంధించి చేపట్టాల్సిన పనులపై రైల్వే భద్రతా కమిటీ సమావేశం నిర్వహించింది.

గుంతకల్లు డివిజన్ కు ఉత్తర్వులు
దక్షిణ మధ్య రైల్వే అధికారులు వీటిపై గుంతకల్లు డివిజన్ కార్యాలయానికి ఉత్తర్వులను పంపించారు. అతి త్వరలోనే పనులు ప్రారంభం కాబోతున్నట్లు అందులో పేర్కొన్నారు. అందుకు నివేదిక సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావడంవల్ల వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. అంతేకాకుండా భారతీయ రైల్వేలో పాకాలకు ప్రత్యేకమైన స్థానం ఏర్పడుతుంది. ప్రస్తుతం తిరుపతి నుంచి రేణిగుంట మధ్యలో మూడోలైను నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆధ్యాత్మికంగా అంతర్జాతీయస్థాయి నగరం కావడంతో పాకాలతోపాటు సమాంతరంగా తిరుపతికి మరిన్ని అత్యాధునిక సౌకర్యాలను కల్పించబోతున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications