తిరుమల కొండల్లోంచి శ్వేతద్వీపానికి మార్గం! శ్రీవారి ఆలయంలోకి రహస్యంగా దేవతలు వస్తుంటారా?
బ్రహ్మాండ నాయకుడు స్వయంభువుగా అవతరించిన పుణ్యప్రదేశంగా, నిత్యమూ లక్షలాది భక్తుల కోరికలు తీరుస్తుండే శ్రీ వెంకటేశ్వరుడిని రహస్యంగా దేవాదిదేవతలు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి వెళుతుంటారట.
తిరుపతి: తిరుమల కొండల్లో శ్వేత ద్వీపం ఉందా? ఇక్కడ యోగులు, సిద్ధులతో పాటు ధవళ వస్త్ర ధారులైన దేవతలు ఉంటారా? వారు అక్కడి నుంచి ఓ రహస్య మార్గం స్వామివారి ఆలయంలోకి వచ్చి, స్వామి వారిని దర్శించుకుని పోతుంటారా?
ఈ ప్రశ్నలన్నింటికీ 'అవును' అని సమాధానమిస్తున్నారు శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులు. దేవదేవుడు కొలువైన తిరుమల గిరుల గురించి ఎంత తెలుసుకున్నా తక్కువేనంటున్నారు ఆయన.
దేవాదిదేవతలు రహస్యంగా...
బ్రహ్మాండ నాయకుడు స్వయంభువుగా అవతరించిన పుణ్యప్రదేశంగా, నిత్యమూ లక్షలాది భక్తుల కోరికలు తీరుస్తుండే శ్రీ వెంకటేశ్వరుడిని రహస్యంగా దేవాదిదేవతలు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి వెళుతుంటారని రమణ దీక్షితులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానల్ తిరుమలపై ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించగా, భక్తులకు ఊహకందని విషయాలను రమణ దీక్షితులు వివరించారు.
పురాణాల్లో కూడా ఉంది...
దేవతలు రహస్యంగా సొరంగ మార్గం గుండా వచ్చి వేంకటేశ్వరుడిని దర్శించుకుని వెళ్లడం ఎన్నో పురాణాల్లో కూడా ఉందని ఆయన చెప్పారు. పవళింపు సేవ తరువాత, సుప్రభాత సేవకు ముందు అసంఖ్యాకంగా దేవతలు స్వామిని సేవించేందుకు వస్తారట. సుప్రభాతం తరువాత, స్వామి వారి గర్భాలయంలోకి అర్చకులు ప్రవేశించే వేళ, వారి భుజాలను తాకుతూ దేవతలు బయటకు వెళ్లిపోతారని చెప్పుకొచ్చారు. అష్టాదశ పురాణాల సారమైన వెంకటాచల మహత్యంలో ఈ వివరాలన్నింటి గురించి చెప్పబడి ఉందని రమణదీక్షితులు పేర్కొన్నారు.
Recommended Video
శ్వేత దీపానికి రహస్య మార్గాలు...
అంతేకాదు, ఈ శ్వేత ద్వీపానికి చేరేందుకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని పవిత్ర స్థలాల్లో రహస్య మార్గాలు ఉన్నాయని, సిద్ధ పురుషులు, యోగులు, దేవతలు వీటి ద్వారా రాకపోకలు సాగిస్తూ, బాహ్య ప్రపంచంలోకి వచ్చి లోక కల్యాణం కోసం కొన్ని కార్యాలు చేస్తుంటారని కూడా ఆయన వెల్లడించారు.
దట్టమైన అడవుల్లో ఓ గుహ...
తిరుమలకు ఉత్తర ఈశాన్య ప్రాంతంలో ఉన్న దట్టమైన అడవుల్లో ఓ గుహ ముఖం ఉందని, అదే శ్వేతద్వీపానికి శేషాచలం కొండల నుంచి రహస్య మార్గమని సూచనగా చెప్పబడుతోందని రమణ దీక్షితులు తెలిపారు. ఈ శ్వేతద్వీపంలో రత్నఖచిత సింహాసనంపై ఓ మహాపురుషుడు ఆశీసులై ఉండి, ఇరువైపులా దేవేరులతో కొలువై ఉంటారని కూడా ఆయన పేర్కొన్నారు.