స్థలం కొరతనే కర్నూలుకు కార్యాలయాల తరలింపుకు కారణమట .. హైకోర్టులో ఏపీ సర్కార్
శాసనమండలిలో పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందకున్నా సీఎం జగన్ రాజధాని కార్యాలయాల తరలింపు నిర్ణయం తీసుకోవటంపై కోర్టును ఆశ్రయించారు రాజధాని ప్రాంత రైతులు . ఇక ఈ పిటీషన్ ను విచారించిన హైకోర్టు ఏపీ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే . ఇక నేడు కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై హైకోర్టుకు వివరణ ఇచ్చింది ఏపీ సర్కార్ .

విజిలెన్స్ కార్యాలయాల తరలింపుపై వివరణ ఇవ్వాలన్న హైకోర్టు
విజిలెన్స్ కార్యాలయాల తరలింపుపై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషన్లపై విచారణ పెండింగ్లో ఉండగా ఆఫీసులను ఎందుకు తరలించారని ధర్మాసనంగతంలో జరిగిన విచారణ సమయంలోనే ప్రశ్నించింది. అంతేకాదు కార్యాలయాల స్థలం సరిపోకుంటే పక్క భవనాల్లోకి మార్చవచ్చు కదా అని ప్రశ్నించింది . ఇక వెంటనే వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక నేడు ప్రభుత్వం హైకోర్టుకు సమాధానం ఇచ్చింది.

అఫిడవిట్ సమర్పించిన ఏపీ ప్రభుత్వం
సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం మేరకు కర్నూలుకు విజిలెన్స్ కమిషన్, కమిషన్ ఆఫ్ ఇంక్వయిరీస్ కార్యాలయాలను తరలించారు. ఇక ఈ తరలింపుపై హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు వాదనలు వినిపించారు . ఇక దీనికి సంబంధించి అఫిడవిట్ సమర్పించింది ఏపీ ప్రభుత్వం. ఈ పిటీషన్లపై ఇవాళ త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

సచివాలయ భవనాల్లో స్థలం కొరత కారణంగానే కార్యాలయాల తరలింపు
సచివాలయ భవనాల్లో స్థలం కొరత కారణంగానే విజిలెన్స్ కమిషన్, కమిషన్ ఆఫ్ ఇంక్వయిరీస్ కార్యాలయాలు తరలించాలని నిర్ణయించామని ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది.అంతేకాకుండా సచివాలయంతో సంబంధం లేని ఏపీ విజిలెన్స్ కమిషనర్, పీఆర్సీ కమిషనర్ తో పాటు మరో 10 విభాగాల తరలింపుపై ప్రతిపాదనలు తమ వద్ద ఉన్నాయని తెలిపింది. సచివాలయంతో సంబంధం లేని ఈ కార్యాలయాలకు 11 వేల చదరపు అడుగుల స్థలం అవసరం ఉందని గుర్తించామని అందుకే తరలింపు నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చింది.

కార్యాలయాల ఏర్పాటుకు కావాల్సిన భవనాలు కర్నూలులో ఉన్నాయన్న ప్రభుత్వం
ఇక ఈ కార్యాలయాల తరలింపుపై గతంలో కర్నూలు కలెక్టర్ తో సంప్రదింపులు జరిపామని, కార్యాలయాల ఏర్పాటుకు కావాల్సిన భవనాలు ఉన్నాయని వారు డిసెంబర్ 23న నివేదిక ఇచ్చారని తెలిపింది. ఇక ఏపీ ప్రభుత్వం ఎక్కడా అవసరం లేకుండా ప్రవర్తించదని, అవసరం లేకున్నా కార్యాలయాలు తరలిస్తున్నారని చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని తెలిపింది ఏపీ సర్కార్ .












Click it and Unblock the Notifications