తల్లి హృదయాన్ని గాయపర్చిన సూటిపోటి మాటలు: కుమారులతో కలిసి ఆత్మహత్య
కర్నూలు: కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం రాచర్ల గ్రామంలో మంగళవారం విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కుమారుల అంగవైకల్యం గురించి బంధువులు చేస్తున్న సూటి పోటి మాటలు ఓ తల్లి హృదయాన్ని తీవ్రంగా గాయపర్చాయి. వారి పరుష మాటలు వినలేక.. ఇద్దరు కుమారులకు పురుగుల మందు తాగించి, తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటనలో తల్లీ, ఓ కుమారుడు మృతి చెందగా, మరో కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కుమ్మరి సుజాత(24), మద్దిలేటి దంపతులకు మహేశ్ (9), సుబ్బయ్య (7) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరూ అంగవైకల్యంతో పుట్టారు. ఏ వేడుకకు వెళ్లినా బంధువులు వారి కుమారుల వైకల్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతుండడంతో సుజాత హృదయం తట్టుకోలేకపోయింది.

మంగళవారం ఉదయం భర్తతోపాటు అత్త, మామలు పొలం పనులకు వెళ్లగా... ఇంట్లో ఉన్న సుజాత ఇద్దరు కుమారులకు పురుగుల ముందు ఇచ్చి తాను కూడా తాగింది. ఇది గమనించిన స్థానికులు వారిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోనే సుబ్బయ్య మృతి చెందాడు.
వైద్యుల సూచన మేరకు సుజాతను ఢోన్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సుజాత కూడా తుది శ్వాస విడిచింది. కాగా, మరో కుమారు మహేశ్ ప్రాణాపాయ పరస్థితుల్లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఓ కొడుకు, తల్లి మృతి వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications