విషాదం: మచిలీపట్నంలో మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి
అమరావతి: కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ పోలీసు కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మచిలీపట్నంలో మహిళా కానిస్టేబుల్గా పనిచేస్తన్న ప్రశాంతి ఆత్మహత్యకు పాల్పడిందని సోలీసులు తెలిపారు. తన ఇంట్లోనే ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మచిలీపట్నంలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రశాంతి.. కుటుంబ కలహాలతో బలవన్మరణానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఆమె మృతి పట్ల కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నదిలో దూకి వాలంటీర్ ఆత్మహత్య
Recommended Video
కృష్ణా నదిలో దూకి వార్డు వాలంటీరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటు చేసుకుంది. తాడేపల్లిలో బుధవారం అదృశ్యమైన వాలంటీర్ రవికుమార్ నదిలో రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సచివాలయ ఉద్యోగుల ఒత్తిడే తన బలవన్మరణానికి కారణమని లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
దీపావలి పండగ రోజున కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఎదరుగా వస్తున్న వాహనం అతివేగం ఇద్దరు యువకుల ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా పామర్రు మండలం కాపవరం వద్ద గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. మచిలీపట్నంవైపు నుంచి పామర్రు వస్తున్న కారు కాపవరం వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఆ తర్వాత కారు పల్టీలు కొడుతూ ఎదురుగా పామర్రు నుంచి నిమ్మకూరు వైపు వెళ్తున్న బైక్ ను ఢీకొట్టింది. దీంతో ఆ బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను కామేశ్వర్ రెడ్డి(24), మోదుగుమూడి ఉమాకంత్(20)గా గుర్తించారు. కారులోని ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.