విషాదం: ఇద్దరు కొడుకులకు ఉరి, మహిళ సూసైడ్
అనంతపురం/నల్గొండ: జిల్లాలోని ధర్మవరం మండలం దర్శనమల గ్రామంలో విషాధం నెలకొంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ మహిళ, తన ఇద్దరు కుమారులకు ఉరివేసి, ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళితే.. కుటుంబ కలహాల కారణంగా సుమలత భర్త నర్సింహులు మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కుటుంబ పోషణ కూడా కష్టమవడంతో సుమలత ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. బుధవారం ఉదయం సుమలత.. తన ఇద్దరు కుమారులు నందివర్ధన్ (5), సుశాంత్ (5)లను ఉరివేసి హత్య చేసింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. దీంతో దర్శనమల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి
నల్గొండ: జిల్లాలోని కట్టంగూర్ శివారులోని విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నా చెల్లెలు మృతి చెందారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఆర్టీసి గరుఢ బస్సు కట్టంగూర్ శివారులో రోడ్డు దాటుతున్న బైకును ఢీకొట్టింది. బైకుపై ప్రయాణిస్తున్న నల్గొండ మండలం అజాలబావికి చెందిన మేకల కృష్ణ, అతని చెల్లెలు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బస్సు డైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
ఇది ఇలా ఉండగా శ్రీకాకుళం గ్రామీణ మండలంలోని కొత్త వెంతన వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళంలోని వేళ్ల వీధికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బైకులపై వెళుతున్న గురు రమేష్ (35), బద్రి జగదీశ్ (35), సిహెచ్ శ్రీనివాస్ (35) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. నూక శ్రీనివాస్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించారు.