రైల్వే కార్యాలయంలో ఉద్యోగిని దారుణ హత్య
విజయనగరం: రైల్వేలో ఎలక్ట్రికల్ టెక్నీషియన్గా పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని, విధులు నిర్వహిస్తున్న కార్యాలయంలోనే హత్యకు గురైంది. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో చోటు చేసుకుంది.. విజయనగరం పట్టణంలోని వుడా కాలనీకి చెందిన చిట్టుమాలి స్వాతి (25) శృంగవరపుకోట రైల్వే ఎలక్రిక్టల్ సబ్స్టేషన్లో టెక్నీషియన్గా, పార్వతి అనే యువతి హెల్పర్గా పనిచేస్తున్నారు.
స్టేషన్కు దూరంగా ఉన్న ఈ సబ్స్టేషన్కు స్వాతి సోమవారం రాత్రి విధులకు హాజరైంది. ఆమె భర్త నాగవినోద్ రాత్రి 7గంటల సమయంలో ఆమెను సబ్స్టేషన్లో దింపి, మరో రెండుగంటలు అక్కడే ఉండి వెళ్లిపోయాడు. స్వాతికి రెండేళ్ల కిందట నాగవినోద్తో వివాహం జరిగింది.

రాత్రి పదిగంటల సమయంలో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చి ద్వారం వద్ద ఉన్న హెల్పర్ పార్వతి ముఖంపై గోనె సంచివేసి, అరిస్తే చంపుతామని బెదిరించి బయటికి తీసుకువెళ్లారు. ఆఫీసులో ఉన్న స్వాతి తలపై ఇసుపరాడ్తో బలంగా కొట్టి ఆఫీసు బయటకు ఈడ్చుకువచ్చి ముఖంపై విచక్షణా రహితంగా కొట్టి హత్య చేశారు. అనంతరం హంతకులు అక్కడి నుంచి పారిపోయారు.
వెంటనే హెల్పర్ పార్వతి ఫోన్ ద్వారా సంబంధిత అధికారులకు, బంధువులకు స్వాతి హత్య విషయం తెలిపారు. మంగళవారం ఉదయం జిల్లా కేంద్రం నుంచి డాగ్స్క్వాడ్, క్లూస్టీంలు సంఘటన ప్రదేశానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications