‘ఫేస్బుక్’ యువతి పిలిచిందని వెళితే.. వెంటాడి నరికి చంపారు
గుంటూరు: జిల్లాలోని కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామ పరిధిలో బుధవారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫేస్బుక్లో పరిచయమైన యువతి రమ్మనడంతో వెళ్లిన ఓ యువకుడ్ని ప్రత్యర్థులు దారుణంగా కత్తులు, కొడవళ్లతో నరికి చంపారు. ఈ దారుణం గురువారం వెలుగులోకి వచ్చింది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన షేక్ రఫీ (26) ఓ హోటల్ నిర్వహిస్తున్నాడు. ఇతనికి ఫేస్బుక్, చాటింగ్, మెసెంజర్ వంటి సామాజిక మాధ్యమాలు ఉపయోగిస్తుంటాడు. ఈ క్రమంలోనే ఊపిరి అనే ఫేస్బుక్ అకౌంట్ను ప్రారంభించాడు. ఆ అకౌంట్లో గత 15 రోజుల క్రితం ఓ యువతితో పరిచయం ఏర్పడింది. దీంతో నిత్యం ఆ యువతితో చాటింగ్ చేస్తూకాలక్షేపం చేసేవాడు.
ఈ క్రమంలోనే యువతి జూన్ 21వ తేదీ సాయంత్రం కంకిపాడు రావాలని చెప్పింది. దీంతో రఫీ తన మిత్రుడు షేక్ అబ్దుల్ జబ్బా(మున్నా)(17)తో కలిసి మోటార్ సైకిల్పై రాత్రి 8 గంటలకు కంకిపాడు వచ్చి యువతికి ఫోన్ చేశాడు. ఆమె తాను పునాదిపాడులోని ఓ కార్పొరేట్ కాలేజీ వద్ద ఉన్నానని అక్కడకు రావాలని చెప్పడంతో రఫీ, మున్నాలు కార్పొరేట్ కాలేజీ వద్దకు చేరుకున్నారు.
కాలేజీ క్యాంపస్ వద్ద ఇద్దరు మహిళలను వివరాలు అడిగి తెలుసుకుంటుండగా ఆటోలో వచ్చిన ఐదుగురు వ్యక్తులు రఫీ, మున్నాలపై కత్తులు, కొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. ఊహించని దాడితో రఫీ, మున్నా చెరోవైపు పరుగులు తీశారు. మున్నా చేతికి స్వల్ప గాయాలవగా అక్కడి నుంచి తప్పించుకొన్నాడు. మంగళగిరికి పారిపోయి దాడి ఘటనను రఫీ బంధువులకు చెప్పాడు.
బుధవారం అర్థరాత్రి పునాదిపాడు కాలేజీ క్యాంపస్ వద్దకు చేరుకున్న రఫీ బంధువులు విచారించారు. కళాశాల సిబ్బందిని ఘటనపై అడిగి తెలుసుకున్నారు. కాగా, సీఐ కె.శ్రీధర్ కుమార్, ఎస్సై హనీష్ బాబు ఘటనా స్థలానికి చేరుకొని రఫీ బంధువులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాత కక్షల నేపథ్యంలో దాడి జరిగినట్లు గుర్తించారు. అనంతరం దాడి జరిగిన ప్రదేశంలో గాలించారు.
గురువారం ఉదయం తిరిగి కాలేజీ వద్దకు చేరుకున్న పోలీసులకు ఖాళీ ప్రదేశంలోని గడ్డిలో రఫీ మృతదేహం కనిపించింది. తల, చేతిపై విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేసినట్లు గుర్తించారు. డీసీపీ క్రాంతి రాణా, ఏసీపీ విజయభాస్కర్, సీఐ కె.శ్రీధర్ కుమార్, ఎస్సై హనీష్ బాబులుసంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్స్క్వాడ్, క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
రఫీని హత్య చేశారు..
రఫీ అన్న నాగూరు మిత్రుడు కనకారావు బంధువులే రఫీని హతమార్చారని భార్య రజియ, తల్లి ఫాతిమా ఆరోపించారు. మే 2వ తేదీన మంగళగిరిలో కనకారావు హత్యకు గురయ్యాడన్నారు. ఆ హత్య కేసులో నాగూరు, రఫీతో పాటు మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అయితే హత్యలో రఫీ ప్రమేయం లేదని వదిలిపెట్టారని చెప్పారు.
అప్పటి నుంచి రఫీపై కక్ష పెంచుకున్న కనకారావు బంధువులే ఈ హత్య చేశారని వారు ఆరోపించారు. ఘటన జరిగిన సమయంలో రఫీ వెంట ఉన్న షేక్ అబ్దుల్ జబ్బా (మున్నా) పాత్రపై కూడా వారు అనుమానాలు వ్యక్తం చేశారు. అతడ్ని కూడా విచారించాలని కోరారు.
అన్నికోణాల్లో విచారించి చర్యలు తీసుకుంటాం: డీసీపీ
హత్యకు గురైన రఫీకి వాస్తవంగా ఫేస్బుక్లో యువతి పరిచయం అయిందా ? లేకుంటే ఎవరైనా కావాలనే యువతిని పరిచయం చేయించి పక్కా ప్లాన్ ప్రకారం చంపారా? అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ క్రాంతి రాణా తెలిపారు. అన్ని కోణాల్లో విచారిరణ చేపట్టి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు.