హోదా కోసం మరో బలిదానం: యువకుడు ఆత్మహత్య, జగన్ దిగ్భ్రాంతి, పోరాడుదామంటూ పిలుపు
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఓ యువకుడు ప్రాణత్యాగానికి పాల్పడ్డాడు. 'ప్రత్యేక హోదా మన హక్కు' అని అతడు తన సూసైడ్ నోట్ రాశాడు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మదనపల్లె రామారావు కాలనీకి చెందిన పారిశుద్ధ్య కార్మికులు రామచంద్ర, సరోజమ్మల కుమారుడు సుధాకర్ శనివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, సుధాకర్ ప్రత్యేక హోదా కోసం నిర్వహించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని స్థానికులు చెబుతున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన చేనేత కార్మికుల సమావేశంలో కూడా సుధాకర్ హోదా కోసం తన గళాన్ని వినిపించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సుధాకర్ మృతితో ఆయన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కాగా, సుధాకర్ ఇటీవలే ఓ అనాథ ఆశ్రమానికి రూ.5వేలు విరాళం ఇచ్చినట్లు తెలిసింది. పేద కుటుంబమే అయినప్పటికీ సేవా కార్యక్రమాల్లో సుధాకర్ చురుకుగా పాల్గొనేవాడని స్థానికులు చెబుతున్నారు. సుధాకర్ హోదా కోసం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, హోదా కోసం బలిదానం చేసుకోవడం చిత్తూరు జిల్లాలో ఇది రెండో ఘటన. గతంలో నుకోటి అనే వ్యక్తి తిరుపతిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆత్మహత్యలు చేసుకోవద్దు, పోరాడి సాధించుకుందాం: జగన్
ప్రత్యేక హోదా కోసం తొందరపడి ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని, అందరం కలిసి పోరాడి సాధించుకుందామని ప్రతిపక్షనేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చిత్తురు జిల్లా మదనపల్లి సుధాకర్ ఆత్మహత్యపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుధాకర్ ఆత్మహత్య విషయం గురించి తెలుసుకున్న వైయస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలా తొందరపడి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని, తల్లి తండ్రులకు శోకాన్ని మిగల్చవద్దని విజ్ఞప్తి చేశారు. బతికుండి పోరాడి సాధించుకుందామని పిలుపునిచ్చారు. సధాకర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా, ప్రస్తుతం జగన్ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు.