ఎపిలో ఆమ్ ఆద్మీ పార్టీ టోపీలకు గిరాకీ, హవా
హైదరాబాద్: అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ దాని హవా కనిపిస్తోంది. హైదరాబాదులో దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోదంది. మై హూ ఆమ్ ఆద్మీ టోపీలకు హైదరాబాదులో గిరాకీ పెరిగింది.
పలువురు సినీ ప్రముఖులతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఆ టోఫీ ధరించేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ టోపీ ఓ ఫ్యాషన్గా కూడా మారింది.
ఆమ్ ఆద్మీ పార్టీ టోపీ ధరించడం చాలా హాయిగా ఉంటోందని చాలా మంది భావిస్తున్నారు. అన్నా హజారే ఉద్యమంతోనే ఆ ధోరణి ప్రారంభమైంది. అయితే, ఆ ధోరణి ప్రస్తుతం పెరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ విజయంతో ఆ పార్టీకి హైదరాబాదులో కూడా ఓ ఊపు వచ్చింది.
ప్రచారం ఏదీ లేకుండా తాము రాష్ట్రంలో 30 వేల మార్కుకు చేరుకున్నామని, తమకు లభిస్తున్న మద్దతు అనూహ్యంగా ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యుడు సి. వినోద్ కుమార్ అంటున్నారు.