జహీద్కు హైదరాబాద్ ఎంపి సీటు ఆఫర్ చేసిన ఆప్
హైదరాబాద్ పార్లమెంటరీ నియోజక వర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థిగా జహీద్ అహ్మద్ ఖాన్ పేరును ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ సంబంధాల కమిటీ(పిఏసి) సూచించినట్లు తెలిసింది. ఒకవేళ జహీద్ అహ్మద్ ఖాన్ తమ అభ్యర్థనకు అంగీకరించినట్లయితే.. అతన్నే ఎన్నికల బరిలో దించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
తాము తమ పార్టీ పిఏసిలో చర్చించామని, ఖాన్ తమ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని ఆయనకు పంపిన ఈ మెయిల్లో ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అంతేగాక తమ పార్టీ తరపున హైదరాబాద్ సిటీ పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని ఖాన్ను ఆప్ కోరినట్లు సమాచారం. ఈ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే తమను సంప్రదించాలని ఖాన్ను కోరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ, సీనియర్ నాయకుడు ప్రశాంత్ భూషణ్ తొలిసారిగా జహీద్ అలీ ఖాన్ను సంప్రదించారని, వారం క్రితమే పార్టీలోకి రావాలని ఆహ్వానించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీ పిఏసిలో చర్చించిన తర్వాత భూషణ్ మళ్లీ అలీ ఖాన్కు ఈ మెయిల్ పంపినట్లు సమాచారం.
ఈ విషయంపై జహీద్ అలీ ఖాన్ను సంప్రదించగా.. తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తన కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ విషయంపై పలుమార్లు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఖాన్ తెలిపారు.