చిన్నారి మృతి, వీడియో: తండ్రి వెనుక.. బోండా ఉమకు మళ్లీ చిక్కులు
క్యాన్సర్తో చిన్నారి సాయిశ్రీ మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు అందింది. సాయిశ్రీ జీవించే హక్కును కాలరాసిన ఆమె తండ్రి, టిడిపి ఎమ్మెల్యే, మరికొందరిపై బాలల హక్కుల సంఘం పిటిషన్
విజయవాడ: క్యాన్సర్తో చిన్నారి సాయిశ్రీ మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు అందింది. సాయిశ్రీ జీవించే హక్కును కాలరాసిన ఆమె తండ్రి, టిడిపి ఎమ్మెల్యే, మరికొందరిపై బాలల హక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది.
వీడియో మెసేజ్, మృతి: బోండా అనుచరులు ఆక్రమించుకోవడం వల్లే
చిన్నారి మృతికి కారకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొంది. ఈ మేరకు విజయవాడ పోలీసు కమిషనర్కు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు.
భర్త శివ, బోండా ఉమపై ఆరోపణలు
విజయవాడ దుర్గాపురంలో ఉంటున్న చిన్నారి సాయిశ్రీ కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. తన బిడ్డ మరణానికి తండ్రి మాదంశెట్టి శివకుమార్, ఎమ్మెల్యే బొండా ఉమ కారణమంటూ చిన్నారి తల్లి సుమశ్రీ ఆరోపించారు.
చిన్నారి వీడియో సందేశం.. ఫిర్యాదు
అంతేకాదు, చిన్నారి తనను బతికించాలని ఆర్థిక సాయం కోరుతూ సెల్ఫీ ద్వారా తండ్రి శివకుమార్ను ప్రాధేయపడుతున్న వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. దీనిపై స్పందించిన హైదరాబాద్లోని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షులు అచ్యుతరావు సోమవారం పిటిషన్ దాఖలు చేశారు.
బోండా ఉమ అండతోనే..
కన్నకూతురు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ బతికించాలని వేడుకున్నా తండ్రి చలించలేదని, ఆమె ఉంటున్న ఇల్లు అమ్మి వైద్యం చేయించుకునేందుకు కూడా సహకరించలేదని మాదంశెట్టి శివ తన సోదరులు, ఎమ్మెల్యే బొండా ఉమా అండతో ఇంటిని కబ్జా చేయడం ద్వారా సకాలంలో వైద్యం అందక చిన్నారి చనిపోయిందని పేర్కొన్నాడు.
ఈ ఘటనపై విచారణ జరిపించి శివకుమార్, బొండా ఉమా, ఘటన వెనుక ఉన్న మరికొందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు పోలీసు కమిషనర్ను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
ఆదేశాలు
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కమిషన్ జూలై 20 లోగా నివేదిక ఇవ్వాలని పోలీసు కమిషనర్కు ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది. మరోవైపు, సాయిశ్రీ అంత్యక్రియలు సోమవారం విజయవాడలో జరిగాయి.
తల్లి ఆవేదన
ఘటనపై స్పందించిన అఖిలపక్ష నేతలు పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ను కలిసి ఆమె మృతికి బాధ్యులపై ఫిర్యాదు చేశారు. వారి వెంట సాయిశ్రీ తల్లి సుమశ్రీ ఉన్నారు.
తన కుమార్తె పట్ల శివకుమార్ తండ్రిలా ప్రవర్తించలేదని, చాలా అసభ్యంగా వ్యవహరించాడని, బొండా ఉమ అనుచరుల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఎప్పటికైనా తనను ఇంట్లో నుంచి బయటకు గెంటేసే అవకాశాలు ఉన్నాయని, తనకు రక్షణ కల్పించాలని తల్లి సుమశ్రీ ఫిర్యాదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేసి చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.
కాగా, ఆర్టీఏ అధికారులతో వివాదం కారణంగా బొండా ఉమ మంత్రి పదవిని చివరలో మిస్ అయ్యారనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు సాయిశ్రీ మృతి నేపథ్యంలో ఆయనకు మరో వివాదం అంటుకుంది.