కేటీఆర్ సెటిల్మెంట్లు చెప్పినందునే: కేసీఆర్పై రాధాకృష్ణ
హైదరాబాద్: కేటీఆర్ సెటిల్మెంట్ల వ్యవహారంపై తాము ఎన్నికల ముందు వార్తలు ప్రసారం చేశామని, ఆ కారణంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ పైన, ఆంధ్రజ్యోతి పత్రిక పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కక్షసాధింపు చర్యలకు దిగారని ఆ సంస్థల ఎండీ రాధాకృష్ణ ఇంగ్లీషు చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఏబీఎన్, ఆంధ్రజ్యోతి స్వతంత్రంగా వ్యవహరిస్తాయని, తమను టార్గెట్ చేస్తే మిగతా మీడియా చానెళ్లు కూడా దాసోహమవుతాయన్న ఉద్దేశ్యంతోనే కేసీఆర్ ఇలాంటి చర్యకు పూనుకున్నారని ఆయన ఆరోపించారు. కాగా, కేసీఆర్ వ్యాఖ్యలు జాతీయ మీడియాలో కూడా చర్చనీయాంశమైంది.
కాగా, మంగళవారం కేసీఆర్ వరంగల్ జిల్లాలో మీడియాకు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. పత్రికలకు స్వేచ్ఛ ఉండాలని, అయితే, అది ప్రజాస్వామ్యయుతంగా ఉండాలన్నారు. అప్పుడే మీడియాకు మర్యాద దొరుకుతుందన్నారు. ఆ రెండు చానళ్లు మళ్లీ తప్పు చేశాయన్నారు. వారు కేసీఆర్ వ్యతిరేక వార్తలు కాదని.. తెలంగాణ రాష్ట్ర వ్యతిరేక వార్తలు రాస్తున్నారన్నారు.

తెలంగాణ ప్రజాప్రతినిధులను, తెలంగాణ శాసన సభను పాచిమొహాలు, టూరింగ్ టాకీస్ సినిమాలు చూసే వాళ్లను మల్టీప్లెక్సులో కూర్చుండబెట్టినట్లుగా ఉందని చెబితే ఊరుకోవాలా అన్నారు. ఇదేనా మీడియాకు ఉన్న స్వేచ్ఛ, సంస్కారం అని ప్రశ్నించారు. ఇలాంటి వాటిని టెలికాస్ట్ చేస్తే చానళ్లను కిలోమీటర్ల మేర పాతరేస్తామన్నారు. కేసీఆర్ను తిడితే ఇబ్బంది లేదని, కానీ తెలంగాణ శాసన సభను కించపరిస్తే ఎలా ఊరుకుంటామన్నారు.
తెలంగాణ ప్రజలను కించపర్చేలా వార్తలు రాస్తే పాతరేస్తామన్నారు. చానళ్ల పైన నాడు శాసన సభనే తీర్మానం చేసిందన్నారు. కేబుల్ ఆపరేటర్ల నిర్ణయంతో తమకు సంబంధం లేదన్నారు. చానళ్లను కేబుల్ ఆపరేటర్లు బంద్ చేశారన్నారు. అయినప్పటికీ కేబుల్ ఆపరేటర్ల నిర్ణయానికి తాను సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. స్వేచ్చ ముసుగులో ఇష్టారీతిగా మాట్లాడితే జాగ్రత్త అని హెచ్చరించారు. ఆ చానళ్ల గురించి ప్రజలు అడగటం లేదన్నారు.
ఈ తెలంగాణ గడ్డ మీద ఉండాలంటే తెలంగాణ ప్రజలను గౌరవించాలని, తెలంగాణ ప్రజలతో కలిసి బతకాలన్నారు. మా జాతికి ద్రోహం చేస్తే క్షమించనని కాళోజీ నారాయణ రావు అన్నారని, ఆయన స్ఫూర్తితోనే ఈ ప్రభుత్వం నడుస్తోందన్నారు. పేదరిక సమాజం పోవాలని, సమాజం బాగుపడాలని, అందుకోసమే ఈ కేసీఆర్ బతికున్నాడన్నారు. చిల్లర రాజకీయాలు తనకు వద్దని చెప్పారు. కాగా, కేసీఆర్ ఎదుట వరంగల్లో పలువురు జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications