సీ ఓటరు సర్వే-చంద్రబాబు వర్సెస్ జగన్: 2019లో ఏపీలో ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారంటే?
న్యూఢిల్లీ/హైదరాబాద్/అమరావతి: రానున్న 2019 లోకసభ ఎన్నికల్లో ఎన్డీయేనే తిరిగి విజయం సాధిస్తుందని, ఉత్తర ప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీలు కలిస్తే మాత్రమే ఎన్డీయేకు మేజిక్ ఫిగర్కు కొన్ని సీట్లు తక్కువగా వచ్చే అవకాశముంది. మొత్తానికి బీజేపీ హవానే ఉంటుందని పలు సర్వేలు తెలుపుతున్నాయి. అయితే, ఉత్తరాదిన, ఈశాన్య రాష్ట్రాల్లో, తూర్పు భారతంలోనే బీజేపీ హవా కనిపించనుంది.
దక్షిణాదిన మాత్రం బీజేపీకి ఇంకా బలం పెరగడం లేదని ఈ సర్వేలు వెల్లడిస్తున్నాయి. దక్షిణాదిన మొత్తం 129 లోకసభ స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17, తమిళనాడులో 39, కేరళలో 20, కర్ణాటకలో 28 లోకసభ స్థానాలు ఉన్నాయి. మొత్తం 129 లోకసభ స్థానాల్లో స్వల్ప స్థానాలు గెలిచింది.
2019లో మళ్లీ బీజేపీదే అధికారం: బీఎస్పీ-ఎస్పీ కలిస్తే మోడీకి చిక్కులు
దక్షిణాదిన బీజేపీ హవా అంతగా ఉండదు
2014లో బీజేపీ కర్ణాటకలో 17, తెలంగాణలో 1, ఏపీలో 2, తమిళనాడులో ఒకటి, కేరళలో సీట్లేమీ రాలేదు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. దక్షిణాదిన ప్రాంతీయ పార్టీల హవా మరింత ఎక్కువ. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే, తెలంగాణలో తెరాస, ఏపీలో టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్, కొత్తగా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలు ఉన్నాయి. కర్ణాటకలో మాత్రమే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటా పోటీ ఉంటుంది. కేరళలో కాంగ్రెస్, సీపీఎం మధ్య పోటాపోటీ ఉంటుంది.
సర్వే ప్రకారం బీజేపీ ప్రభావం నామమాత్రమే
తాజాగా, ఏపీబీ - సీ ఓటరు సర్వే ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం ఏమాత్రం మెరుగుపడలేదు. ఆ పార్టీ లేదా ఎన్డీయే కూటమి 2019 లోకసభ ఎన్నికల్లోను కేవలం 15 స్థానాలే గెలుచుకుంటుందని ఈ సర్వేలో వెల్లడైంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి, అన్నాడీఎంకే పార్టీలు బీజేపీ మిత్రులుగా విపక్షాలు ప్రచారం చేస్తున్నప్పటికీ.. ఎన్డీయేలో ఎంతమేర కలుస్తాయనేది ప్రశ్నే.
సరికొత్త పొత్తులు, టీడీపీకి లాభం
అదే సమయంలో, దక్షిణాదిన ఈసారి సరికొత్త పొత్తులు కనిపిస్తున్నాయి. మూడున్నర దశాబ్దాలకు పైగా కాంగ్రెస్, టీడీపీలు కలవలేదు. ఇప్పుడు మొదటిసారి ఏపీలో ఆ రెండు పార్టీలు కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఏపీలో టీడీపీపి ప్లస్ కానుంది. గతంలో ఏపీబీ - సీ ఓటరు సర్వేలో ఏపీలో జగన్ పార్టీకి 21, టీడీపీకి 4 సీట్లు వస్తాయని తేలింది. కానీ కాంగ్రెస్తో పొత్తు తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడినప్పటికీ.. ఏపీలో మాత్రం ఆ రెండు పార్టీల కలయిక ప్లస్ కానుందని ఈ సర్వేల ద్వారా తెలుస్తోంది.
ఏపీ, తెలంగాణలలో టీడీపీ, తెరాసలదే హవా
తాజాగా రిపబ్లిక్ టీవీ సర్వే, సీ ఓటరు సర్వేలు అదే చెబుతున్నాయి. కాంగ్రెస్ పొత్తు కారణంగా టీడీపీ కూటమికి అంటే యూపీఏకు 11 సీట్లు, వైసీపీకి 14 సీట్లు వస్తాయని రిపబ్లిక్ సర్వేలో తేలింది. గతంలో సీ ఓటరు సర్వేలో వైసీపీకి 21 సీట్లు వస్తాయని తేలింది. ఇప్పుడు వైసీపీకి ఏకంగా 7 సీట్లు తగ్గుతున్నాయి. ఇక్కడ బీజేపీకి ఏ పార్టీతోను పొత్తు లేనందున ఎన్డీయేకు సీట్లేమీ రావని తేల్చింది. ఆ తర్వాత సీ ఓటరు సర్వే కూడా ఏపీలో టీడీపీకి గతంలో కంటే ఎక్కువ మద్దతు పెరిగిందని తెలిపింది. ఇక, తెలంగాణలో తెరాసకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి.
మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పొత్తులు
ఇక, కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీంతో ఇక్కడ కూడా బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పైగా జేడీఎస్తో కాంగ్రెస్కు పొత్తు ఉంది. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణాది విషయానికి వస్తే కాంగ్రెస్ కంటే బీజేపీ దాదాపు ఒంటరి. కాంగ్రెస్ పార్టీకి ఆయా రాష్ట్రాల్లో డీఎంకే, తెలుగుదేశం, జేడీఎస్ పార్టీలతో పొత్తు ఉంది. బీజేపీ మాత్రం దాదాపు ఒంటరిగా లేదా చిన్న పార్టీలతో బరిలోకి దిగనుంది. ఈ కారణంగా దక్షిణాదిన 2019లోను బీజేపీ కంటే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు దక్కించుకోనుంది.