శ్రీశైల మల్లన్న నగలు కాజేసింది సాగర్ బాబేనా?: లాకర్లలో ఆభరణాలు!
కర్నూలు: గతంలో శ్రీశైలం దేవస్థానం ఈవోగా పనిచేసిన విజయసాగర్ బాబు... మల్లిఖార్జున స్వామి ఆభరణాలను కాజేశాడని వస్తున్న వార్తలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే విజయవాడలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన సాగర్ బాబుపై అవినీతి నిరోధక శాఖ దాడులు చేసిన విషయం తెలిసిందే.
కాగా, ఈ దాడుల్లో సాగర్ బాబు దాచేసిన రూ.60 కోట్ల మేర అక్రమాస్తులు బయటపడ్డాయి. అంతేగకా, విజయవాడలోని ఆంధ్రా బ్యాంకు లాకర్లో దొరికిన నోట్ల కట్టలపై శ్రీశైలం టెంపుల్ బ్రాంచ్ కు చెందిన స్టిక్కర్లు ఉన్న విషయం ఏసీబీ అధికారులను షాక్కు గురి చేసింది.

ఈ క్రమంలో శ్రీశైలం, గుంటూరుల్లోని ఆంధ్రా బ్యాంకు లాకర్లను తెరచిన అధికారులకు శ్రీశైల మల్లన్నకు దాతలిచ్చినట్లుగా భావిస్తున్న ఓ వెండి బిందె, కొన్ని పాత్రలు కనిపించాయి. దీంతో సాగర్ బాబు.. మల్లన్నకు దాతలు ఇచ్చిన ఆభరణాలను కూడా కొట్టేశాడన్న అనుమానాలు బలపడ్డాయి.
ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారుల సమక్షంలో ఏసీబీ అధికారులు మల్లన్న ఆభరణాలు దాచిన ఆంధ్రా బ్యాంకు లాకర్ను బుధవారం ఉదయం ఓపెన్ చేశారు. ఇప్పటిదాకా భక్తుల నుంచి మల్లన్నకు అందిన బహుమతుల జాబితా ముందు పెట్టుకున్న అధికారులు ఆభరణాలను పోల్చి చూస్తున్నారు.
కాగా, ఈ ప్రక్రియ గురువారం కూడా కొనసాగే అవకాశాలున్నాయి. ఈ ఆభరణాల పరిశీలన పూర్తి అయితే తప్ప, సాగర్ బాబు.. మల్లన్న మిగితా ఆభరణాలనేమైనా కాజేశాడా? లేదా? అనే విషయం తేలే అవకాశం లేదు.












Click it and Unblock the Notifications