చంద్రబాబు బెయిల్ పిటీషన్ల ఫై కీలక అప్డేట్..!!
తెలుగుదేశం అధినేత బెయిల్ పిటీషన్ పై ఏసీబీ కోర్టు విచారణ వాయిదా వేసింది. చంద్రబాబుకు మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. పిటీషనర్ న్యాయస్తానంలో తమ వాదనలు వినిపించారు. బెయిల్ ఇవ్వాలనే వాదనలపైన సీఐడీ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో..ఈ నెల 19వ తేదీన తదుపరి విచారణ కోసం న్యాయస్థానం కేసు వాయిదా వేసింది.
ఏసీబీ కోర్టులో బెయిల్ పిటీషన్ : ఈ నెల 9వ నంద్యాలలో స్కిల్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. 10వ తేదీన విజయవాడ ఏసీబీ కోర్టులో సుదీర్ఘ విచారణ తరువాత చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఇప్పటికే హైకోర్టులో చంద్రబాబు తరుపు న్యాయవాదులు క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు.

దీని పైన కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, కేసు విచారణ 19వ తేదీకి న్యాయమూర్తి వాసయిదా వేసారు. ఇదే సమయంలో చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వాలంటూ దాఖలైన పిటీషన్ ను కోర్టు 19వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో, తాజాగా చంద్రబాబుకు మద్యంతర బెయిల్ కోసం ఒక పిటీషన్, బెయిల్ కోసం మరో పిటీషన్ ను ఏసీబీ కోర్టులో దాఖలు చేసారు.
ప్రమేయం లేదన్న చంద్రబాబు : ఈ పిటీషన్లను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. అందులో భాగంగా బెయిల్ పిటీషన్ లో చంద్రబాబు పలు అంశాలను ప్రస్తావించారు. తన పాత్రపై ప్రాథమిక ఆధారాలు లేకపోయినా సీఐడీ కేసు నమోదు చేసారని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదులో తన పేరు లేదని చెప్పుకొచ్చారు. రాజకీయ ప్రతీకారంతో ఈ కేసులో తనను లాగారని పిటీషన్ లో పేర్కొన్నారు.
ప్రధాన బెయిల్ పిటిషన్ తేలేలోపు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును అభ్యర్దించారు. కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత తనపై ఆరోపణలు మళ్లీ తెర మీదకు తెచ్చి సీఐడీ కేసు పెట్టిందని వివరించారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ ఆమోదం లేకుండా నా పేరు FIR లో చేర్చటం, దర్యాప్తు, అరెస్ట్ చేయటం చట్ట విరుద్ధమని చంద్రబాబు కోర్టుకు నివేదించారు.

19కి విచారణ వాయిదా : బెయిల్ ఇవ్వటానికి ఈ ఒక్క కారణం సరిపోతుందని, తప్పుడు కేసు అయినా..దర్యాప్తుకు సహకరించటానికి సిద్దంగా ఉన్నానని వెల్లడించారు. సాక్షులను ప్రభావితం చేయటం, సాక్ష్యాలను తారుమారు చేస్తాను అనే సీఐడీ వాదనకు ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ పిటీషన్ పైన చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కౌంటర్ దాఖలు కోసం సీఐడీ తరపు న్యాయవాది సమయం కోరారు. బెయిల్ ఇవ్వాలనే వాదనలకు సీఐడీ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేసారు.
దీంతో, బెయిల్ కు సంబంధించిన రెండు పిటీషన్ల పైన విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేస్తూ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. అదే రోజున హైకోర్టులో క్వాష్ పిటీషన్...ఏసీబీ కోర్టులో బెయిల్, కస్టడీ పిటీషన్ల పైన విచారణ జరగనుంది. దీంతో 19వ తేదీనే చంద్రబాబు బెయిల్ పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications