ఎసిబిలో ఇంటిదొంగలు...సమాచారం లీక్ చేస్తున్న ఉద్యోగిపై కేసు నమోదు...
అమరావతి: అవినీతిని నిరోధించాల్సిన ఎసిబి ఉద్యోగులే అక్రమాలకు తెగబడ్డ వైనం సంచలనం సృష్టిస్తోంది. చేయబోయే దాడుల గురించి అవినీతిపరులకు ముందే సమాచారం లీక్ చేస్తున్న ఎసిబి ఉద్యోగి గుట్టురట్టు అయింది. తన కార్యాలయంలోనే పనిచేస్తూ ఇంత తప్పుడు పనికి పాల్పడిన ఉద్యోగిపై ఎసిబి డిజిపి ఠాకూర్ ఫైర్ అయ్యారు. ఆ అక్రమార్కుడిపై కేసు నమోదుకు ఆదేశించారు.
అవినీతి నిరోధక శాఖలో కీలకమైన విభాగంలో పనిచేస్తున్న శోభన్ అనే ఉద్యోగి తమ శాఖ దాడుల గురించి ముందుగానే అవినీతిపరులకు సమాచారం ఇస్తున్నట్లు బైటపడిన విషయం ఇప్పుడు ఎసిబిలోనే కాదు ఎపి మొత్తంలో చర్చనీయాంశంగా మారింది. అవినీతిపరుల ఆట కట్టించాల్సిన వారే ఈ విధంగా అడ్డదారులు తొక్కడం దారుణమనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
రహస్య విభాగం ఉద్యోగే...
ఎసిబి శాఖలో రహస్య విభాగంలో పనిచేసే శోభన్ అనే ఉద్యోగి ఎసిబి జరపబోయే దాడుల గురించి తెలియగానే వెంటనే సంబంధిత వ్యక్తులకు ఫోన్ చేసి వారిపై జరపబోయే దాడుల గురించి హెచ్చరిస్తున్నాడట. ఎంతమంది ఉద్యోగులు, ఏఏ ప్లేసుల్లో దాడుల్లో జరపబోతోంది తదిదర విషయాలన్నీ ముందుగానే సమాచారం అందిస్తున్నాడట.
అక్రమార్కుడిపై డిజిపి నిఘా
అయితే ఇటీవల అవినీతి ఉద్యోగులపై జరిపిన కొన్ని దాడుల సందర్భంగా వారు అప్రమప్తంగా వ్యవహరించి అక్రమాస్తుల వివరాలు అందకండా చేసినట్లు ఎసిబి డిజిపి ఠాకూర్ కు అనుమానం వచ్చిందట. దీంతో ఇదెలా సాధ్యమైందన్నఅలోచించగా ఇది తమ శాఖలలోనే అక్రమార్కుల పని అయిఉండొచ్చని ఊహించారట. దీంతో కీలక సమాచారం గురించి ముందుగా ఎవరెవరికి తెలుసుండొచ్చనే దిశలో ఆలోచించి అనుమానం ఉన్న వారిపై నిఘా పెట్టారట.
ఇంటి దొంగ దొరికిపోయాడిలా...
ఎసిబి దాడుల గురించి ముందుగా సమాచారం వెళ్లే విభాగాల్లో రహస్య విభాగం ఒకటి. ఆ శాఖలో పనిచేసే ఉద్యోగుల్లో కొంత అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న శోభన్ బాబు అనే సూపర్ వైజర్ పై నిఘా పెట్టగా బైటపడ్డ విషయం తెలిసి డిజిపి ఠాకూర్ కూడా విస్తుపోయారట. ఎసిబి దాడుల నిమిత్తం ఎసిబి ఉద్యోగులు సమాయాత్తమవుతుండగానే సందట్లో సడేమియాలా శోభన్ ఆ అవినీతిపరులకు ఫోన్ చేసి తనకు తెలిసిన మేరా అన్నీ వివరాలు చెప్పేసేవాడట. ఇంకేముంది ఇలా వింటే అలా అల్లుకుపోయే మన అక్రమార్కులు ఈ ఇంటి దొంగకు ముందు ధన్యవాదాలు ఆ తరువాత పరిహారం చెల్లించుకునేవారట. శోభన్ బాబు వ్యవహారంపై అనుమానం వచ్చిన డిజిపి అతడి కాల్ డేటా సేకరించి విశ్లేషించగా ఇంకేముంది ఇతగాడి ఘనకార్యాల గురించి మొత్తం గుట్టు బైటపడిందట.
50 మంది అవినీతిపరులకు సమాచారం ఇలాగే...
ఈ విధంగా ఈ శోభన్ బాబు ఇప్పటివరకు కనీసం 50 మంది అవినీతిపరులకు ముందుగానే సమాచారం ఇచ్చినట్లు విచారణలో తేలిందట. దీంతో ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించిన ఎసిబి డిజిపి ఠాకూర్ ఇతడిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారట.అలాగే ప్రాధమిక సమాచారం ఆధారంగా శోభన్ బాబుపై కేసు నమోదుకు డిజిపి ఆదేశించినట్లు తెలిసింది.
శోభన్ భాబు ఎక్కడెక్కడ పనిచేశాడు?
శోభన్ బాబు నిర్వాకంతో ఆగ్రహించిన ఢిజిపి ఠాకూర్ అతడికి సంబంధించి పూర్తి వివరాలు బైటకు తియ్యమని అదేశించడంతో అధికారులు అతడి కార్యకలాపాల గురించి సమగ్రంగా విచారణ చేస్తున్నారట. 1989లో జూనియర్ స్టెనోగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన శోభన్ బాబు ఆ తరువాత విశాఖ ఏసీబీ రేంజ్ లో 9 ఏళ్లు పనిచేసినట్లు తెలిసింది. ఆ తరువాత 1997 నుంచి ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. దీంతో ఇటీవలి కాలంలోనే 50 మందికి సమాచారం చేరవేసి ఉంటే, సుదీర్ఘ కాలం నుంచి రెండు దశాబ్ధాలుగా ఇక్కడే పనిచేస్తున్న నేపథ్యంలో ఇంకెంతమందికి ఈ విధంగా సమాచారం ఇచ్చి ఉంటాడనే కోణంలో ఎసిబి అధికారులు తమ ఇంటి దొంగ శోభన్ బాబుపై పూర్తి విచారణ జరుపుతున్నారట.