చేసేది అటెండర్ ఉద్యోగం: ఆస్తులు మాత్రం రూ.కోట్లలో., ప్రమోషన్ వచ్చినా కదల్లేదు!
నెల్లూరు: అతను చేసేది సాధారణ అటెంటర్ ఉద్యోగమే.. కానీ అతని సంపాదన మాత్రం కోట్లలో. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.80కోట్ల అక్రమాస్తులను కూడబెట్టాడతడు. దీంతో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు అతని ఇంటిపై దాడులు చేసి అక్రమాస్తుల వివరాలను తేల్చారు.
నెల్లూరు జిల్లా ఉప రవాణా శాఖ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న నరసింహారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. విజయవాడ ఏసీబీ డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి.

నరసింహారెడ్డి ఆదాయానికి మించి.. భారీగా ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తుల విలువ రూ.80కోట్లపైనే ఉంటుందని అధికారులు తెలిపారు.
50 ఎకరాల భూమికి సంబంధించిన దస్త్రాలు, 18ఫ్లాట్లు, రెండు కిలోల బంగారం, 7.5లక్షల నగదును ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతేగాక, నెల్లూరు నగరంలో 222 చదరపు గజాల నివాస స్థలం, గుడిపాళెం గ్రామంలో 3.950 ఎకరాల వ్యవసాయ భూమి పత్రాలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
నరసింహారెడ్డి భార్య పేరుతో నెల్లూరులోని పలు చోట్ల 1300కుపైగా చదరపు గజాల్లో నివాస స్థలాలు, నెల్లూరు ఎంవి అగ్రహారంలో జీప్లస్ టు భవనం, 47ఎకరాల వ్యవసాయ భూమి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే, అతనికి సంబంధించిన రెండు బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉంది. కాగా, గత కొన్నేళ్లుగా ప్రమోషన్లు వచ్చిన నరసింహారెడ్డి మాత్రం వెళ్లకుండా.. నెల్లూరు శాఖ కార్యాలయంలోనే అటెండర్గా పని చేస్తుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications