అవినీతి చేప: సబ్ రిజిస్ట్రార్ వెంకయ్య ఆస్తులు రూ.50 కోట్లకు పైగానే
గాజువాక సబ్ రిజిస్ట్రార్ వెంకయ్య ఇళ్లలో ఏసీబీ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో తనిఖీలు నిర్వహించారు.
గాజవాక: గాజువాక సబ్ రిజిస్ట్రార్ వెంకయ్య నాయుడు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో తనిఖీలు నిర్వహించారు.
విశాఖలో ఆరు, తిరుపతిలో 3, రాజమండ్రిలో నాలుగు.. మొత్తం పదమూడు చోట్ల సోదాలు నిర్వహించారు. ఉదయం ఆరు గంటల నుంచి ఎసిబి అధికారులు సోదాలు ప్రారంభించారు.
ఆయన ఇంటితో పాటు, బంధువుల ఇళ్లలోను సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు, రికార్టుల ట్యాంపరింగ్ కేసులు ఆయన పైన నమోదయ్యాయి. అధికారులు కీలక పత్రాలు పరిశీలిస్తున్నారు.
పందిమెట్టలో భారీగా బంగారం, నగదు గుర్తించారు. మూడు లాకర్లను అధికారులు గుర్తించారు. వడ్లపూడిలో రూ.1.20 కోట్ల ఆస్తులు గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్ వెంకయ్య నాయుడు 2011లోను ఆకస్మిక తనిఖీల్లో పట్టుబడ్డాడు. అప్పుడు రూ.88 వేలు ఎక్కువగా ఉండటంతో పట్టుబడ్డాడు.
రూ.50 కోట్లకు పైగా ఆస్తులు
ఎసిబి అధికారులు రూ.50 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించినట్లుగా తెలుస్తోంది. చెన్నై, హైదరాబాదుల్లో ఆస్తులు ఉన్నాయని, అలాగే, తిరుపతి సమీపంలో పెద్ద ఎత్తున భూములు ఉన్నట్లుగా గుర్తించారని తెలుస్తోంది.