ఏసీబీ దాడులు, ఏడీఈ ఆస్తులు రూ.20 కోట్లు: కాల్ మనీతో లింక్?
అమరావతి: కృష్ణా జిల్లా విజయవాడలోని మారుతీ నగర్లో విద్యుత్ శాఖ ఏడీఈ రామసుబ్బారావు ఇంట్లో ఏసీబీ మంగళవారం తనిఖీలు నిర్వహించింది. అతని వద్ద రూ.20 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించినట్లుగా తెలుస్తోంది. అతనికి కాల్ మనీతోను సంబంధాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.
సోదాల్లో రూ.ఒకటిన్నర కోట్ల విలువైన ప్రామిసరీ నోట్లను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా సుబ్బారావు అవినీతికి పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు ఇవ్వకుంటే పనులు జరగవని ప్రజలను బెదిరించేవాడని తెలుస్తోంది.

సోదాల్లో వడ్డీ వ్యాపారానికి సంబంధించిన ప్రామిసరీ నోట్లు బయటపడ్డట్లుగా తెలుస్తోంది. దీంతో అతనికి కాల్ మనీతో సంబంధం ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. గన్నవరం, సూరంపల్లి, బండారుగూడెం తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. పలుచోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు.
ఇటీవల ఏపీలో కాల్ మనీ వ్యవహారం సంచలనం రేపిన విషయం తెలిసిందే. కాల్ మనీ వ్యవహారం అనంతరం కాల్ మనీ - సెక్స్ రాకెట్ కూడా తెరపైకి వచ్చింది. కాల్ మనీ కేసులో పలువురు అధికారులు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు. ఈ నేపథ్యంలో సుబ్బారావు వద్ద పెద్ద ఎత్తున అక్రమాస్తులు ఉండటం, ప్రామిసరీ నోట్లు బయటపడటం గమనార్హం.












Click it and Unblock the Notifications