ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి, 8 మందికి తీవ్ర గాయాలు
కడప: జిల్లాలోని దువ్వూరు మండలం కానగూడూరు వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుమల నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ మినీ ట్రావెల్స్ బస్సు, రోడ్డు పక్కన ఆగి ఉన్న ఇసుక ట్రాక్టర్ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన ఒకే కుటుంబంవారు తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం అనంతరం మినీ బస్సులో తిరిగి వస్తుండగా.. ఖానగూడురు వద్ద బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇసుక ట్రాక్టర్ను ఢీకొట్టింది.
దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 8మందికి గాయాలయ్యాయి. మృతుల్లో చిన్నారులు ఉన్నారు. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను కర్నూలు జిల్లా చాగలమర్రి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 15మంది ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.