పుష్కరాల్లో వరుస ప్రమాదాలపై ఎన్నో డౌట్స్, మొన్నటి ఘటనలో షాకింగ్!
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పుష్కరాల సమయంలో వరుస ప్రమాదాల పైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పుష్కరాల ప్రారంభానికి నెల రోజుల ముందు రాజమండ్రి ఇన్నీసుపేటలో ఒక డ్రెయినేజీ కల్వర్టు కింద బాంబు పేలుడు సంభవించింది.
ఆ తర్వాత గోదావరి పుష్కరాల ప్రారంభం తొక్కిసలాట జరిగి 27 మంది మృతి చెందారు. మరోవైపు, బుధవారం నాడు పుష్కరాల ఘాట్కు వెళ్లే ప్రధాన రహదారిలో అగ్ని ప్రమాదం జరిగింది.
ఈ సంఘటనల వెనుక కుట్ర కోణం ఉందా, పుష్కర వేడుకలను భగ్నం చేసే ప్రయత్నం దాగి ఉందా, అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు. బుధవారం గోకవరం బస్టాండు వద్ద జరిగిన అగ్ని ప్రమాదంపై లోతుగా ఆరా తీస్తున్నారు.
అక్కడ షార్ట్ సర్క్యూట్ కాలేదని విద్యుత్ అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఎలాంటి పేలుళ్లు జరగలేదని అంటున్నారు. మంటలకు గ్యాస్ సిలిండర్లు కారణం కాదని అగ్నిమాపక శాఖ చెప్పింది. గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన శకలాలు దొరకలేదని తెలుస్తోంది. దీంతో అనుమానాలు బలపడుతున్నాయి.
పుష్కరాల తొలి రోజున జరిగిన తొక్కిసలాట, బుధవారం నాటి అగ్ని ప్రమాద సమయంలో ఆయా ప్రదేశాల్లో రికార్డు అయిన సిసిటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
అనుమానాస్పద సంభాషణలను కనుగొనేందుకు టెలిఫోన్ ఆపరేటర్ల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. కాగా, పుష్కరాలలో జరిగిన తొలి రోజు ప్రమాదం ఘటన పైన విపక్షాలు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును తప్పు పడుతున్న విషయం తెలిసిందే.