Acharya: చిరంజీవి సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్: తెలంగాణ కంటే కాస్ట్లీ
అమరావతి: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సినిమా ఆచార్య. ఈ శుక్రవారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కొరటాల శివ దర్శకుడు. చిరంజీవి సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ-మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కించాయి. కోట్ల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో విడుదలైన రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్- ఛాప్టర్ 2ను మించిన వసూళ్లు రాబట్టుకుంటుందని భావిస్తున్నారు.
ఈ పరిణామాల మధ్య తెలంగాణ ప్రభుత్వం ఆచార్య చిత్రం యూనిట్కు శుభవార్త వినిపించిన విషయం తెలిసిందే. తెలంగాణలో టికెట్ల రేట్లను పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. ఒక్కో టికెట్పై మల్టీప్లెక్స్లో 50 రూపాయలు, ఇతర థియేటర్లల్లో 30 రూపాయలను అదనంగా పెంచుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో పాటు ఆచార్య అయిదో ఆట ప్రదర్శనకు కూడా వారం రోజుల పాటు అనుమతి కల్పించింది.
ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా అదే తరహా ఉత్తర్వులు ఇచ్చింది. టికెట్ మీద 50 రూపాయలను పెంచుకునే వెసలుబాటును కల్పించింది. మల్టీప్లెక్స్, ఇతర థియేటర్లు.. అనే తేడా చూపించలేదు. సింగిల్ స్క్రీన్ థియేటర్లల్లో కూడా టికెట్పై 50 రూపాయలను అదనంగా వసూలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన జీవోను జారీ చేసింది. హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఈ జీవోను విడుదల చేశారు.
సినిమా విడుదలైన తేదీ నుంచి 10 రోజుల పాటు ఈ వెసలుబాటు ఉంటుంది. అనంతరం ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే టికెట్లను విక్రయించుకోవాల్సి ఉంటుంది. నాన్ మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లల్లో తెలంగాణ ప్రభుత్వం 30 రూపాయలను పెంచుకోవడానికి అనుమతి ఇవ్వగా.. ఏపీలో ఆ పరిస్థితి లేదు. మల్టీప్లెక్స్, నాన్ మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అనే తేడా చూపించలేదు.
అన్ని థియేటర్లల్లోనూ సమానంగా 50 రూపాయల మేర టికెట్ ధరను పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీనితో తెలంగాణలో కంటే ఏపీలో ఆచార్య సినిమా టికెట్ల ధర అధికంగా ఉన్నట్టయింది. అయిదో ఆట ప్రదర్శనపై ఇంకా స్పష్టత రాలేదు. దీనికి ఇంకా అనుమతి లభించాల్సి ఉందని తెలుస్తోంది. అయిదో ఆటగా ఆచార్యను ప్రదర్శించడానికి దాదాపుగా అనుమతులు లభించకపోవచ్చని, ఆ కారణంతోనే నాన్ మల్టీప్లెక్స్ థియేటర్లలోనూ టికెట్ల రేటును పెంచడానికి అంగీకరించినట్లు చెబుతున్నారు.